wowitstelugu.blogspot.comరథసప్తమి విశిష్టత ఏమిటి వ్రత విథి విధానాలు మూల కథ గురించి తెలుసుకోండి
సప్తానాం పూరణీ సప్తమీ' అంటే ఒకటి నుండి ఏడు వరకూ గల స్థానాలు పూరించేది సప్తమి, సూర్యరథ గమనానికి కారణమైంది కనుక ఈ పండుగకు రథసప్తమి అని పేరుపెట్టారు పెద్దలు.
కొందరు రథ సప్తమినే సూర్యజయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది సూర్యుడు తన ఉష్ణచైతాన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధులలో ప్రవేశించిన రోజు ఇది. అయితే లోకంలో సూర్య జయంతిగా పిలవబడుతూ ఉంది. ఇక్కడ రథారోహణమే ప్రధానకృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది.
ఇది మామూలు రథంకాదు. దీనికి ఒక్కటే చక్రం. తొడల నుండి క్రిందభాగం లేని 'అనూరుడు' రథసారథి ఛందస్సులనే గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి. ఏ మాత్రమూ నిలిచే ఆధారంలేని ఆకాశంలో పయనిస్తుంది ఈ రథం. ఇన్ని విలక్షణ విశేషాలున్నాయి కనుకనే ఈ పండగని రథం పేరుగల సప్తమిగా వ్యహరిస్తారు.
సూర్యరథానికి ఉన్న గుర్రాలను ఛందస్సులంటారు. ఇవన్నీ వేద ఛందస్సులు. అవి 1. గాయత్రి, 2. త్రిష్టుప్, 3. జగతి అనుష్టుప్, 5. పంక్తి, 6. బృహతి, 7. ఉష్ణిక్ అనేవి. వాటికి ఎప్పటికీ అలసట లేదు. గుర్రం వేగవంతమైన చైతన్యానికి చిహ్నం సూర్యుని ఏడుగుర్రాలూ 7 రకాల కాంతి కిరణాల్ని ప్రసరిస్తూ ఉంటాయి కనుక సూర్యకిరణాల్లో 7 రంగులుంటాయి.
హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. దక్షిణ భారతములో ఈరోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకొందురు. ఇతర మాసములలోని సప్తమి తిథులకన్న మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది.
ఆ రోజు ఉపవాసముండి, సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము.
విధి విధానాలు
సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ,
అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్.
మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా,
కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః.
👍మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆరోజున అరుణోదయవేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును.
👍సప్తమినాడు షష్ఠి తిథి గూడయున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈయోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము.
👍జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.
👍ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.
👍 రథసప్తమినాడు బంగారముతోగాని, వెండితోగాని, రాగితోగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయవలెను.
రథసప్తమినాడు పాటించాల్సిన సూర్య మంత్రం
యదా జన్మకృతం పాపం
మయాజన్మసు జన్మసు తన్మీరోగంచ శోకంచ
మాకరీ హంతు సప్తమీ ఏతజ్ఞన్మకృతం పాపం
యచ్ఛ జనమంతరార్జితం మనోవాక్కాయజం
యచ్ఛ జ్ఞాతాజ్ఞాతేచ యే పున: సప్త విధం పాపం
స్నానామ్నే సప్త సప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి
కాల గమన నిర్ణయం
🌞సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది.
🌞సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది.
🌞తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది.
🌞 అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు.
🌞 "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు.
🌞 "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారును భారతీయులే
భవిష్యోత్తర పురాణములో రథసప్తమి వ్రతవిధానం
"ఈ వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేసెను".
👉 పూర్వము కాంభోజ దేశమున యశోధర్ముడను రాజుండెను. అతనికి ముదిమి ముప్పున ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారునికి ఎప్పుడును రోగములు వచ్చెడివి. తన కుమారునికి వ్యాధులకు కారణమేమని రాజు బ్రాహ్మణులను అడిగెను. "నీ కుమారుడు పూర్వ జన్మమున పరమలోభియైన వైశ్యుడు. రథసప్తమీ మహాత్మ్యము వలన నీ కడుపున పుట్టెను. లోభియగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యెను అని తెలిపిరి.
👉 దీనికి పరిహారమడిగిన రాజుకు బ్రాహ్మణులు ఎలా చెప్పారు. ఏవ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమీ వ్రతమును ఆచరించిన పాపము నశించి చక్రవర్తిత్వము పొందును. ఆ వ్రత మాచరించిన రాజునకు తగిన ఫలితము కలిగెను.
తూర్పు దిక్కున ఆరాధన :
రథ సప్తమి నాడుసూర్య కిరణాలు పడేచోట మీ ఇంట్లో లేదా ఇంటి కాంపౌండ్ లో ఎక్కడైతే సూర్యకిరణాలు స్పష్టంగా పడతాయో లేదా తులసి చెట్టు ఉన్న ప్రాంతంలో ఒక పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేయాలి. తర్వాత ముగ్గులు వేసి సూర్యభగవానుడి ఫొటోను అక్కడే ఉంచాలి. దానికి గంధం మరియు కుంకుమ పెట్టి, ఎర్రని పువ్వులతో అలంకరించాలి. కొబ్బరి పుల్లల లేదా చిక్కుడు కాయల సహాయంతో చిన్న రథం చేసి సూర్యుడి రథంగా భావించి పూజ చేసి, ఆవు నేతితో దీపారాధన చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు
సూర్య దేవునికి నైవేద్యం:
తులసి కోట ఎదరుగా చిక్కుడు కాయలతో రథం వేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడను నేలపై అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి, పిడకలను వెలిగించి పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేసి నైవేద్యం గా పెడతారు.
రథసప్తమి జిల్లేడు ఆకుల స్నానం మూల కథ
- రథసప్తమినాడు స్నానసమయంలో నెత్తిపై జిల్లేడాకు పెట్టుకోవాలి. ఆ ఆకునే ఎందుకు పెట్టుకోవాలి? ఏ తమలపాకో చిక్కుడాకో ఎందుకు పెట్టుకోకూడదు అన్నసందేహమూ వస్తుంది.
- దీని వెనుక ఒకకథ ఉంది. పూర్వం అగ్నిష్వాత్తులు అనే పండితులు మహానిష్ఠతో చాలా యజ్ఞాలు చేశారు.
- ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది, వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవవిమానం పంపించాడు.
- ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిష్వాత్తులు. ఆ దేవవిమానం చూసిన సంభ్రమంలో వారు ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు.
- అయితే ఆసమయంలో పెద్దగాలిరావడంతో కొంత వేడివేడి నెయ్యి ప్రక్కనే ఉన్న ఒకమేకపై పడింది.
- ఆ వేడికి మేకచర్మం ఊడిపోయి మరణించి, దాని ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవవిమానంలో కూర్చుంది. ఆచర్మం ప్రక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది.
- అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్త్వం మారిపోయి, మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది.
- అలా జిల్లేడాకు యజ్ఞంత సమయంలో ఆజ్యధారలు ధరించడంతో పరమపవిత్రం అయ్యింది. జిల్లేడు ఆకును ముట్టుకొంటే మేకచర్మంలా మెత్తగా ఉంటుందందుకే! జరిగిన దానికి అగ్నిష్వాత్తులు బాధపడ్డారు.
- అప్పుడు ఆకాశవాణి, "మీరు దుఃఖించాల్సిన పనిలేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి, దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది.
- ఈ జిల్లేడు మేకచర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారింది" అని పలికింది. ఆ మాట అగ్నిష్వాత్తుల్ని సంతోషపరిచింది. అది మాఘశుద్ధ సప్తమీతిథి.
- అప్పటి నుండి రథసప్తమినాడు నెత్తిపై జిల్లేడాకు పెట్టుకుని, సూర్యప్రీతి కోసం స్నానం చేసేవారికి లేశమాత్రం యజ్ఞఫలం లభిస్తోంది. ఏడుజన్మల పాపాలు పోతున్నాయి.
ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో రథసప్తమి గురించి తెలుసుకోండి
Today's Quote:
"Your time is limited, so don’t waste it living someone else’s life."
-Steve Jobs
Note:
దయచేసి కింది ఉదహరించిన నా బ్లాగులు, చాన్నేళ్ళు, పేస్ బుక్ పేజీ లు పూర్తిగా చివరి వరకు చూడండి లైకు,షేర్. చేయండి. నోటిఫికెషన్ ల కోసం సబ్స్క్రయిబ్ చేయండి