కార్తీక పురాణం రెండవ రోజు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కార్తీక పురాణం రెండవ రోజు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, నవంబర్ 2020, మంగళవారం

2 కార్తీక పురాణం విశిష్టత, కార్తీక పురాణం రెండవ రోజు పారాయణం

wowitstelugu.blogspot.com
2 కార్తీక పురాణం విశిష్టత, కార్తీక పురాణం రెండవ రోజు పారాయణం

రెండవ అధ్యాయం - కార్తీక సోమవార వ్రతం 

  • వశిష్ట ఉవాచ:

ఓ జనక మహారాజా! విన్నంత మాత్రంతోనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వపాపాలనూ హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను. అందులోనూ ఈ నెలలో శివుడికి ప్రీతికరమైన సోమవారం వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసం చేరుకుంటాడు. కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారం రోజయినా సరే స్నానం, జపాలు ఆచరించేవాడు వెయ్యి అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి ఆరు రకాలుగా ఉంది. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం, స్నానం, తిలాదానం.

  • ఉపవాసం:

శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలు అంతా భోజనం చేయకుండా (ఉపవాసం) తో గడిపి, సాయంత్రం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తరువాత తులసీతీర్థం మాత్రమే సేవించాలి

  • ఏకభుక్తం:

సాధ్యం కానివాళ్ళు ఉదయం స్నానం, దానం, జపాలు యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి, రాత్రి భోజనానికి బదులు శివుడి తీర్థమో, తులసీతీర్థమో మాత్రమే తీసుకోవాలి. 

  • నక్తం:

పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయవచ్చు.
అయాచితం గా భోజనం కోసం తమకు తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం 'అయాచితం' 

  • స్నానం:

పైవాటికి వేటికీ శక్తి లేనివాళ్ళు సమంత్రక స్నానం, జపం చేసినా చాలు. 

  • తిలాదానం:

మంత్రం, జపం విధాలు కూడా తెలియనివాళ్ళు, కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసినా సరిపోతుంది.

వ్రత ఫలితం 

  • పై ఆరు పద్ధతులలో దేన్నీ ఆచరించినా 'కార్తీక సోమవారవ్రతం' చేసినట్లే అవుతుంది. 
  • కానీ తెలిసి కూడా ఏ ఒక్కదాన్నీ ఆచరించనివాళ్ళు ఎనిమిది యుగాలపాటు కుంభీపాతర మొదలైన నరకాలను పొందుతారని అర్షవాక్యం. 
  • ఈ వ్రతం ఆచరణ వలన అనాథలూ, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యం పొందుతారు. 
  • కార్తీకమాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజూ కూడా పగలు ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజు అంతా భగవంతుని ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సన్నిధిని పొందుతారు. 
  • సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమకచమక సహితంగా శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి.

నిష్టురి కథ 

పూర్వం ఒకానొక బ్రాహ్మణుడికి 'నిష్టరి' అనే కూతురు ఉండేది. పుష్టిగానూ, అందంగానూ, అత్యంత విలాసంగానూ ఉండే ఆమెకు గుణాలు మాత్రం శ్రేష్టమైనవి రాలేదు. దుష్టగుణ భూయిష్టమైన గయ్యాళిగానూ, కాముకురాలిగానూ తిరిగే ఈ 'నిష్టరి'ని ఆమె గుణాల వల్ల 'కర్కశ' అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశని సౌరాష్ట్ర బ్రాహ్మణుడు అయిన మిత్రశర్మ అనే వాడికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు.  ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాకుండా సహృదయం కూడా కావడం వలన కర్కశ ఆడినది ఆట పాడినది పాటగా కొనసాగుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడంతో మోజు చంపుకోలేక కొంతా, భార్యను వదిలివేయడం తన వంశానికి పరువుతక్కువ అనే ఆలోచన కొంత వలన మిత్రశర్మ, కర్కశ పెట్టే కఠినమైన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు. కాని, ఏనాడూ ఆమెను శిక్షంచలేదు. ఆమె ఎందఱో పరపురుషులతో అక్రమసంబంధం పెట్టుకుని భర్త, అత్తా, మామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకరోజు ఆమె విటులలో ఒకడు ఆమెను పొందుతూ ... 'నీ మొగుడు బ్రతికి ఉండటం వలన మనం తరచూ కలుసుకోలేక పోతున్నా'మని రెచ్చగొట్టడంతో, కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రలో వున్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపేసి, ఆ శవాన్ని తానే మోసుకుని వెళ్ళి ఒక పాడుపడిన నూతిలోకి విసిరి వేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకి ఆమె విటుల బలం ఎక్కువ కావడం వల్ల, అత్తమామలు ఆమెను ఏమీ అనలేక, తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ, కన్నుమిన్ను కానని కామావేశంతో అనేకమంది పురుషులతో సంపర్కం పెట్టుకుని నిత్యసురత క్రీడలలో తేలియాడసాగింది. తాను చెడింది కాకుండా ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింప చేసి తన విటులకు తార్చి దానిద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది, దాని బలం తగ్గింది, యవ్వనం పోయింది, శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కశ జబ్బుపడింది. ఎంతోమంది పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని, అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తిలాంటి మేని పుళ్ళు పడిపోయింది. జిగీబిగీ తగ్గిన కర్కశ దగ్గరికి విటులు రావడం తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. చివరికి అక్రమపతులకే కానీ, సుతులకు నోచుకోని ఆ నిష్టర, తినడానికి తిండీ, ఉండడానికి యింత ఇల్లూ, వంటినిండా కప్పుకోవడానికి బట్టలు కూడా కరువయ్యాయి. కొనవూపిరితో ప్రాణలతో నడివీధినపడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కుకూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్దను చేసి నరకానికి తీసుకుని వెళ్ళారు. యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. 
                      

భర్తద్రోహికి భయంకర నరకం

భర్తను మరచిపోయి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి, ఆమె చేత మండుతున్న యినుప స్తంభాలను కౌగిలించుకునేలా చేశాడు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముళ్ళగదతో ఆమె తల చిట్లిపోయేలా కొట్టించాడు. భర్తను తిట్టినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు కర్కశ పాదాలను పట్టుకొని కఠినమైన శిలలపై వేసి బాదించాడు. సీసం కాచి చెవులలో పోయించాడు. కుంషీపాత నరకానికి పంపాడు. ఆమె పాపాలకుగాను ఆమె ముందు పదితరాలవారూ, తరువాత పదితరాలవారూ ఆమెతో కలిపి మొత్తం 21 తరాలవారిని కుంభీపాతంలో కుమిలిపోసాగారు. నరక అనుభవం తరువాత ఆమె పదిహేనుసార్లు భూమిపై కుక్కగా జన్మించింది. పదిహేనవ జన్మలో కళింగ దేశంలో కుక్కగా పుట్టి, ఒక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది.

సోమవార వ్రత ఫలంతో కుక్క కైలాసం పొందటం 

ఇలా ఉండగా, ఒక కార్తీక సోమవారం రోజు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి, శివుడికి అభిషేకాలు మొదలైనవి నిర్వహించి, నక్షత్ర దర్శనం తరువాత నక్తం తీసుకోవడానికి సిద్ధపడి, ఇంటిబయట బలివి విడిచిపెట్టాడు. ఆరోజంతా ఆహారం దొరకక ఉపవాసం (పస్తు) పడుకుని ఉన్న కుక్క ప్రదోష రోజున ఆ బలి అన్నాన్ని తిన్నది. బలి భోజనం వల్ల దానికి పూర్వస్మృతి కలిగి 'ఓ బ్రాహ్మణా! రక్షంచు' అని కుయ్యి కుయ్యి అని అరిచింది. దాని అరుపులు విని వచ్చిన బ్రాహ్మణుడు కుక్క మాటలాడటం చూసి ఆశ్చర్యపోతూనే 'ఏం తప్పు చేశావు? నిన్ను నేను ఎలా రక్షించగలను?' అని అడిగాడు. 

అందుకు ఆ కుక్క 'ఓ బ్రాహ్మణుడా! పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ స్త్రీని. కామంతో కళ్ళు మూసుకుపోయి, కాముకురాలిని అయి చేయకూడని పనులు చేశాను. భర్త హత్యకూ, వర్ణ సంకరానికి కారకురాలినైన పతితను. ఆ పాపాలకు అనుగుణంగా అనేకకాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి, ఈ భూమిపై ఇప్పటికి 14సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా నా పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు. దయచేసి వివరించు' అని కోరుకుంది.

బ్రాహ్మణుడు అంతా జ్ఞానదృష్టితో తెలుసుకుని 'ఓ శునకమా! ఈ కార్తీక సోమవారం రోజున ప్రదోష సమయం వరకూ పస్తుతో ఉండి నేను వదిలిపెట్టిన బాలి తిన్నందువల్ల నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది' అని చెప్పాడు. దాంతో ఆ కుక్క 'కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా! నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో దయచేసి తెలుపు' అని కోరిన తరువాత దయాపరుడైన ఆ బ్రాహ్మణుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం రోజు వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా, వెంటనే ఆ కుక్క తన కుక్క దేహాన్ని విడిచిపెట్టి దివ్యస్త్రీ శరీరంతో, ప్రకాశవంతమైన వస్త్రాలతో, పితృదేవతలతో కలిసి కైలాసానికి చేరుకుంది. కాబట్టి ఓ జనకరాజా! నిస్సంశయంగా శ్రేయస్కరమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పకుండా ఆచరించు అని వశిష్టుడు చెప్పడం ఆపాడు. 
                 

 ద్వితీయ అధ్యాయం సమాప్తం 
                  

రెండవ రోజు పారాయణం సమాప్తం 


ఈ క్రింది వీడియో యు.ఆర్.యల్. ల.లో వీడియోలు చూడండి




Note:
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుంది,  థాంక్యూ.