wowitstelugu.blogspot.com
సరస్వతీదేవి కరుణతో విశేష ఙ్ఞానం, వాక్శుద్ధి, మంత్రసిద్ధి, ఙ్ఞానసిద్ధి, ధారణాసిద్ధి, మేధాసిద్ధి, ని కలిగించే వసంత పంచమి గురించి తెలుసు కుందాము
మాఘశుద్ధ పంచమినే 'వసంత పంచమి' అంటారు. మాఘమాసం తెలుగు నెలలో శుక్ల పంచమిలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు. ఈరోజున దేశంలో వసంతకాలం ప్రారంభమవుతుంది.
పదకవితా పితామహుడైన అన్నమాచార్యుడు శ్రీవేంకటేశ్వరుని హంసగా అభివర్ణించారు. ‘‘దిబ్బలు వెట్టుచు దేలినదిదివో ఉబ్బునీటిపై నొక హంసా. ’’ ‘‘పాలు నీరు నేర్పరచి పాలలో నోలాడె నిదె వొకహంసా...’’అంటూ సంకీర్తన ఆలపించాడు.
హంసకు పాల నుండి నీటిని వేరుపరచే అద్భుతమైన శక్తివుంది. అంటే మంచిని గ్రహించి, చెడును విస్మరించటం అని దీని అర్థం.
- ‘సరస్వతి’ అనే పదం ‘తనను తాను తెలుసుకునే శక్తి’ అని కూడా చెప్పవచ్చును. ఈ శక్తి ఙ్ఞానులకు మాత్రమే సాధ్యం. అటువంటి ఙ్ఞానానికి, సర్వ కళలకు అధిదేవతైన శ్రీసరస్వతీదేవి మాఘ శుద్ధ పంచమినాడు జన్మించినట్లుగా చెబుతారు.
- మాఘమాసం శిశిరఋతువులో వచ్చినప్పటికి, వసంతఋతువుకు స్వాగత సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఇదే రోజును శ్రీపంచమిగాను, మదనపంచమిగాను, వసంతపంచమిగాను కూడా జరుపుకుంటారు.
- సరస్వతీదేవిని బ్రహ్మే తనకు తోడుగా ఉండటానికి సృజించాడని విష్ణుపురాణంలోను, దుర్గామాత సృజించిందని దేవీభాగవతంలోను కనబడుతుంది.
- సరస్వతిదేవి చదువుకు, ఙ్ఞానానికి అధిష్టానదేవత. అందువలన ఆ దేవి సకల చరాచర బ్రహ్మాండంలో పూజలందుకుంటోంది.
- పరమాత్మ తత్వాన్ని గ్రహించటానికి పరమాత్మ ఙ్ఞానం అవసరం. ఙ్ఞాన సముపార్జనకు మానసిక ఏకాగ్రత ముఖ్యం. మానసిక ఏకాగ్రతకు ధ్యానం ప్రధానం.
- ధ్యానానికి విద్య మూలం. విద్య అంతర్ముఖ, బహిర్ముఖ ఉద్ధీపన కలుగచేస్తుంది. సక కళలకు, విద్యకు అధిదేవత శ్రీసరస్వతీదేవి. సరస్వతీ కటాక్షం లేకుండా ఎటువంటి ఙ్ఞానసముపార్జన జరుగదు.
- ఙ్ఞానసముపార్జన లేని జీవితం వ్యర్థమౌతుంది. సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. ఆమె వీణ ధరించి, పుస్తకం చేబూని, హంసవాహనంపై ధవళ వస్త్రాలంకరణలో, నిర్మలంగా, ప్రశాంతంగా దర్శనమిస్తుంది. ‘హంస’ను పరబ్రహ్మంగా కీర్తిస్తారు.
వసంత పంచమి రోజున వయోభేదం లేకుండా అందరూ సరస్వతీ పూజలు చేస్తారు. ముఖ్యంగా పిల్లలచేత పూజలు నిర్వహిస్తారు. దీనివలన వారికి మంచి విద్యాబుద్ధులు అలవడతాయని నమ్మిక. ఉదయాన్నే కాలకత్యాలునెరవేర్చుకుని, అభ్యంగన స్నాన మాచరించి, మంచి దుస్తులు ధరించాలి. ఇంటిని మామిడి ఆకులతో, పుష్పాలతో అలంకరించాలి. పూజాగృహాన్ని కూడా శోభస్కరంగా అలంకరించాలి. సరస్వతీదేవిని ఉచితాసనంపై ప్రతిష్టించి, సుగంధ ద్రవ్యంతో అభిషేకించి, చక్కని వస్త్రాలంకృతిని చేసి, తాజా పుష్పాలతోను, మంచి గంధంతోను, ధూప దీపాలతోనూ షోడశోపచారాలతో పూజ నిర్వహించాలి. పూజలో పిల్లల పుస్తకాలు, కలం మొదలగువాటిని ఉంచి పూజచేయాలి. తరువాత ఆమెకు ప్రీతిపాత్రమైన మధుర పదార్థాలను నివేదన చేసి, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించాలి. సకల విద్యలు అలవడటానికి భక్తిశ్రద్ధలతో ప్రార్థన చేయాలి. ఇదేరోజున పిల్లల చేత అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు. తోటి పిల్లలకు పలకలు, పెన్సిళ్ళు పంచిపెడతారు.
ప్రసిద్ధ సరస్వతీ క్షేత్రాలు
మనదేశంలో అనేక ప్రసిద్ధ సరస్వతీ క్షేత్రాలున్నాయి.
👉అదిలాబాద్ జిల్లాలోని బాసరలో ఙ్ఞానసరస్వతీ ఆలయం,
👉కాశ్మీరులోని శారదాదేవి ఆలయం
👉నల్గొండ జిల్లాలోని అడ్లూరి గ్రామంలోని సరస్వతీ ఆలయం
👉కర్ణాటకలోని శృంగేరిలో శ్రీ శంకరాచార్య ప్రతిష్టిత శారదా దేవీ ఆలయం .
- ఈ రోజును మదన పంచమిగా రతీమన్మధులను పూజిస్తారు. దీనివలన దంపతుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయని నమ్మిక.
- దేవీనవరాత్రులలో దుర్గామాత సరస్వతీ అలంకారంలో దర్శనమిస్తుంది. సరస్వతీదేవికి శారదాదేవి, హంసవాహిని, బుద్ధిధాత్రి, వరదాయని, కౌమారి మొదలగు పేర్లున్నాయి.
- సరస్వతీ పురాణంలో దక్షిణామూర్తి, బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుడు, శ్రీరాముడు, గణపతి, కుమారస్వామి, వాల్మీకి, వ్యాసుడు, ఇంద్రుడు, సూర్యుడు, శంకరాచార్యుడు మొదలైనవారు స్తుతించిన స్తోత్రాలు కనబడతాయి.
- సరస్వతీదేవి కరుణతో విశేష ఙ్ఞానం, వాక్శుద్ధి, మంత్రసిద్ధి, ఙ్ఞానసిద్ధి, ధారణాసిద్ధి, మేధాసిద్ధి కలిగి సర్వత్రా జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ ప్రార్థన చేద్దాం.
పూజా విధానం
సరస్వతి దేవికి పూజా విధానం..
వసంత పంచమి రోజున సరస్వతి దేవిని తెల్లని పుష్పాలతో పూజించి… అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం.. నేతితో పిండివంటలు, చెరకు, అరటిపండ్లు, నారికేళం వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి. ఇలా పూజిస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది. కుల, మత భేదాలు లేకుండా ప్రపంచమంతా సరస్వతి దేవిని పూజిస్తున్నా మాఘ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి ప్రత్యేకతను సంతరించుకుంటుంది.
“యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణావరదండ మండితకరాయా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిదేవై సదా పూజితా
సామాంపాతు సరస్వతీ, భగవతీనిశ్శేష జడ్యా పహః..” శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీ దేవి కాబట్టి. అందుచేత విజయదశమితో పాటు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా ఆ సరస్వతీ దేవీ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. సరస్వతీ దేవి ఆలయాలను విద్యార్థులు దర్శించుకోవడం ద్వారా విద్యారంగంలో రాణిస్తారని పండితులు సూచిస్తున్నారు.
ఈ రోజున ఎన్నో శుభకార్యాలను నిర్వహిస్తారు. సకలవిద్యా స్వరూపిణి సరస్వతీ దేవిగా జన్మదినంగా పేర్కొన్నారు. శ్రీపంచమిని విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి, అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది. విద్యాదానం జ్ఞానదానమేనని అన్న దానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందంటారు. శాంతమూర్తియైన సరస్వతీ దేవి ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్దులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి దక్కుతుందని పండితులు చెబుతుంటారు.
వసంత పంచమి శుభ సమయం...
పవిత్ర సమయం ఫిబ్రవరి 16న మధ్యాహ్నం 3.36కు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 17న ఉదయం 5.46 గంటల వరకు ఉంటుంది. ఫిబ్రవరి 16న ఉదయం 6.59కి సరస్వతి దేవికి పూజ చేయడం, మధ్యాహ్నం 12.35కి మధ్య శుభ సమయం ఉంటుంది.
ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో వసంత పంచమి గురించి తెలుసుకోండి :