కార్తీక పురాణము - మొదటిరోజు పారాయణము
శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన:
శ్లో !! వాగీశాద్యా సుమనస్స స్సర్వార్థానా ముపక్రమే !
యన్నత్వా కృతకృత్యాస్సుస్తం నమామి గజాననమ్ !!
శౌనికాధులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట …
- శ్రీ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టిలో విశిష్టమైన శ్రీనైమిశారణ్యానికి విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి, సంతుష్టుడిని చేసి, స్థానికులైన శౌనకాది ఋషులు ఆయన వద్దకు వచ్చి 'సకల పురాణగాథ అయిన, నూతమునీ కలికల్మశ నాశానకం అయిన కైవల్య దాయకమయిన కార్తీకమాస మహత్యము విన్పించి మమ్మల్ని ధన్యులను చేయమని అడిగారు.
- వారి కోరికను మన్నించిన వ్యాసశిస్యుడు అయిన సూతమహర్షి 'శౌనకాదురాలా! మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద, పద్మపురాణాలు రెండింటిలోనూ తెలియజేసి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్టులవారిచే , రాజ మహర్షి ఆయన జనకుడికి స్కాంద పురాణం లోనూ, హేలా విలాసాల బాలామణి అయిన సత్యభామకు, లీలామానుష విగ్రహుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మచేత పద్మపురాణంలోనూ ఈ కార్తీక మహత్యం సవిస్తరంగా చెప్పబడింది.
- మన అదృష్టంవలన నేటినుంచే కార్తీకమాసం ప్రారంభం కాబట్టి, ప్రతిరోజూ నిత్యపారాయనగా ఈ మాసం అంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాము. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ట మహర్షిచే కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను, వినండి' అని చెప్పడం మొదలుపెట్టాడు.
శ్లో నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తుతే
'ఓ దామోదరా! నా ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తిచేయి' అని నమస్కార పూర్వకంగా సంకల్పించుకుని, కార్తీక స్నానం ప్రారంభించాలి.
కార్తీకంలో సూర్యోదయ వేళ కావేరీనదిలో స్నానం చేసినవారి పుణ్యం చెప్పలేనిది.
సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలలో చేరుతుంది. సరస్సులు, సెలయేర్లు, చెరువులు, జలాశయాల్లో కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు.
బ్రాహ్మణుడు అయినవాడు కార్తీకమాసంలో నదికి వెళ్ళి హరి ధ్యానం చేస్తూ, కాళ్ళూ, చేతులూ కడుక్కుని, ఆచమనం చేసి, శుద్దాత్ముడై, మంత్రయుక్తంగా భైరవ ఆజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి.
దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలాలి.
మంత్రజపంతో, బొటన వ్రేలి కొనతో నీటిని కెలికి, మూడు దోసిళ్ళ నీళ్ళు గట్టుమీదకి చిమ్మి, తీరం చేరుకోవాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీన్నే యక్ష్ముతర్పణం అంటారు.
ఒళ్ళు తుడుచుకుని, పొడివీ, మడివీ తెల్లబట్టలు వేసుకుని హరిస్మరణ చేయాలి.
గోపీచందనంతో 12 ఊర్థ్వ ఉండ్రాళ్ళు ధరించి, సంధ్యావందన గాయత్రీ జపం ఆచరించాలి.
ఔపాసన చేసి, బ్రహ్మయజ్ఞం ఆచరించి, తన తోటలోనుంచి చక్కటి పువ్వులను తెచ్చి శంఖ-చక్రధారి అయిన విష్ణువును, సాలగ్రామంలో భక్తిగా షోడశోపచారాలతో పూజించాలి.
కార్తీకపురాణం చదవటం కానీ, వినటం కానీ ఆచరించే వాడై, ఇంటికి చేరి దేవతార్చన, దీపార్చన చేసి, భోజనం చేసి, ఆచమనం చేసి తిరిగి పురాణ కాలక్షేపం చేయాలి.
సాయంకాలం అవగానే ఇతర పనులు అన్నీ ముగించుకుని, విష్ణు ఆలయంలో కానీ, శివాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి, అక్కడి స్వామిని ఆరాధించి, భక్షభోజ్యాదులు నివేదించిన తరువాత శుద్ధమైన మాటలతో వారిని స్తుతించి నమస్కారం చేయాలి.
ఈ కార్తీకమాసం అంతా ఈ విధంగా వ్రతాన్ని చేసినవారు పునర్జన్మ లేకుండా వైకుంఠంలో స్థిరనివాసం పొందుతారు.
ప్రస్తుత, పూర్వ జన్మలలో చేసిన పాపాలు అన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించిపోతాయి. వర్ణం, లింగభేదం, వయస్సుతో సంబంధం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించినవారు ఎవరైనా మోక్షం పొందటానికి అర్హులు అవుతారు అనడంలో ఎటువంటి సంకోచం లేదు.
జనకరాజా! తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేక పోయినా ఇతరులు చేస్తుండగా చూసి, అసూయలేకుండా ఆనందించేవాడికి అ రోజున చేసిన పాపాలు అన్నీ విష్ణుకృప అగ్నిలో ఆహుతి అయిపోతాయి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి