1, డిసెంబర్ 2020, మంగళవారం

28 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ

wowitstelugu.blogspot.com

28 కార్తీక పురాణము విశిష్టత -  ఇరవై  ఎనిమిదవ  రోజు పారాయణ



శ్రీక్రిష్ణుడు చెబుతున్నాడు

ఇరవై అయిదవ అధ్యాయం:

  • సత్యభామ! నారదప్రోక్తలైన (నారదుడు చెప్పిన)సంగతులతో ఆశ్చర్యమనస్కుడు అయిన పృథువు, ఆ ఋషిని పూజించి, అతని వద్ద శలవు తీసుకున్నాడు. 

  • ఆ కారణంగా ఈ మూడు వ్రతాలూ కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రం అయి ఉన్నాయి. మాఘ కార్తీక వ్రతముల వలెనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా! ఎవరయితే వీటిని విధివిధానంగా ఆచరిస్తారో, వాళ్ళు నాకు యజ్ఞాది కర్మకాండలు చేసినవారికంటే కూడా చేరువ స్నేహితులు అవుతున్నారు. 

  • అటువంటి వాళ్ళు నా కరుణాప్రాప్తులై పాపభీతి లేనివాళ్ళు అవుతారు.

  • శ్రీ కృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ 'స్వామీ! ధర్మదత్తునిచే ధారపోయబడిన పుణ్యంవలన 'కలహ'కు కైవల్యం లభించింది. 

  • కేవలం కార్తీకమాసపు పుణ్యంవలన రాజద్రోహ మొదలైన పాపాలు పటాపంచలు అయిపోతున్నాయి. 

  • స్వయంకృతాలో, కర్తలనుండి దత్తములో అయినవి సరే, అలా కాకుండా మానవజాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానం ఏమిటి? దానిని వివరించు' అని కోరడంతో గోవిందుడు ఇలా చెప్పసాగాడు.


పాపపుణ్యములు ఏర్పడు విధానము


శ్లో     దేశ గ్రామకులానిస్యు ర్భోగభాంజికృతాదిషు     
           కలౌతు కేవలంకర్తా ఫలభు క్పుణ్య పాపయోః

  • 'ప్రియా! కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు దేశానికీ, త్రేతాయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికీ, ద్వాపరయుగంలోనివి వారివారి వంశాలకి చెందినవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ 'కర్త' ఒక్కడికే సిద్ధిస్తుంది. 

  • సంసర్గరహిత సమాయత్తములయే పాపపుణ్యాలను గురించి చెబుతాను విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించటంవలన, ఒక స్త్రీతో రమిచడంవలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగానూ, సంపూర్తిగానూ అనుభవిస్తున్నాడు.

  • వేదాదిబోధనల వలన, యజ్ఞము చేయడంవలన, పంక్తిభోజనంవలన కలిగే పాపపుణ్యాలలో నాలుగవవంతును మాత్రమే పొందుతున్నాడు. 

  • ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన, వినడంవలన, తలచుకోవడంవలన అందులోని వందవభాగాన్ని తాను పొందుతున్నాడు.

  • ఇతరులను ద్వేషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితూరీలు చేసేవాడు, వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని, తన పుణ్యాన్ని జారవిడుచుకుంటున్నాడని తెలుసుకో. 

  • తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుని చేతనో, ఇతరుల చేత సేవలు చేయించుకొన్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును యిచ్చి తీరాలి.

  • అలా ఈయనివాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకున్నవాడు అవుతున్నాడు, పంక్తి భోజనాలలో, భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికీ జరిగిందో వారు, యజమానుల పుణ్యంలో ఆరవభాగాన్ని హరించినవారు అవుతున్నారు. 

  • స్నాన, సంధ్యాదులను ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా, వారు తమ పుణ్యంలో ఆరవవంతు ఆ యితరులకు కోల్పోతారు. 

  • ఎవరినుంచి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మవలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వానికే చెబుతుంది. 

  • కర్తకు కర్మఫలం తప్ప మరేమీ మిగలదు. దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్య కర్మలవలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ చేసేవాడికి దక్కదు.

  • ఋణశేషం ఉండగా మరణించినవారి పుణ్యంలో - శేషఋణానికి తగినంత పుణ్యం ఋణదాతకు చెందుతూ వుంది. పాపంగాని, పుణ్యంగాని, ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడూ, ఆ పనిచేయడంలో తోడుపడేవాడు, దానికి తగిన సాధన సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక ఆరవవంతు ఫలాన్నీ పొందుతారు. 

  • ప్రజల పాపపుణ్యాలలో రాజుకు, శిష్యుడివాటిలో గురువుకు, కుమారుడినుండి తండ్రికి, భార్యనుండి భర్తకు - ఆరవభాగము చేరుతుంది. 

  • ఏ స్త్రీ అయితే పతిభక్తి కలది, నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతుంది. తన సేవకుడో, కొడుకోగాని ఇతరునిచేత ఆచరింపచేసిన పుణ్యాలలో తనకు ఆరవవంతు మాత్రమే లభిస్తుంది.

  • ఈ విధంగా ఇతరులు ఎవరూ మనకి దానం చేయకపోయినా, మనకేమీ నిమిత్తమూ లేకపోయినా వివిధ జనసాంగాత్యాలవలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించకతప్పడం లేదు. 

  • అందువల్లనే సజ్జనసాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి, ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను.


ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం

ఇరవై ఆరవ అధ్యాయం 

ధనేశ్వరుని కథ - సత్సాంగత్య మహిమ


బహుకాల పూర్వం అవంతీపురంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగానే ధనికుడు అయిన అతగాడు కులాచార భ్రష్టుడయి పాపకర్మల పట్ల ఆసక్తుడయి సంచరించేవాడు. 

అసత్య భాషణం, చౌర్యం, వేశ్యాగమనం, మధుపానం, మొదలైన దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమేగాక, షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు.


వర్తకం నిమిత్తం ఒక దేశమునుంచి మరొక దేశానికి వెళ్ళడం అతని అలవాటు. అదే విధంగా ఒకసారి మాహిష్మతీనగరం చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదానది ప్రవహిస్తూ ఉంది.


ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీకమాసం ప్రవేశించింది. దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది. 

వచ్చేపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతంది కదా! ధనేశ్వరుడు ఆ నెలంతా అక్కడనే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజూ నర్మదా తీరంలో సంచరిస్తూ, అక్కడ స్నాన-జప-దేవతార్చనా విధులను నిర్వహిస్తున్న బ్రాహ్మణులను చూశాడు. 

కొందరు కార్తీక పురాణ శ్రవణాన్ని ఆచరించడం చూశాడు. మరికొందరు నృత్యగాన మంగళవాద్య యుతంగా హరికీర్తనలను, కథలను ఆలపించేవారూ, విష్ణుముద్రలను ధరించినవాళ్ళు, తులసి మాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు,

చూడటమే కాదు, నెలపొడుగునా అక్కడే మసలుతూ ఉండటం వలన వారితో పరిచయం కలిగింది, వారితో సంభాషిస్తూ ఉండేవాడు. ఎందఱో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు. 

చివరకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణునామ ఉచ్చారణం కూడా చేసేవాడు. నెలరోజులూ యిట్టె గడిచిపోయాయి. 

కార్తీక ఉద్యాపనా విధినీ, విష్ణు జాగారాన్నీ కూడా దర్శించాడా ధనేశ్వరుడు. పౌర్ణమినాడు గో, బ్రాహ్మణ పూజలను ఆచరించి, దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు. తరువాత సాయంకాలం శివప్రీత్యర్థ్యం చేయబడిన దీపోత్సవాలను తిలకించాడు. 

సత్యభామా! నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో శివారాధన దేనికా అని ఆశ్చర్యపడకు సుమా!


శ్లో || మమరుద్రస్వయఃకశ్చి దంతరం వరికల్పయేత్ 
         
తస్యపుణ్య క్రియాస్సర్వానిష్ఫ లాస్యుర్న సంశయః!!


  • ఎవరైతే నన్నూ, శివుణ్ణీ భేదభావంతో చూస్తారో, వారియొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృథా అయిపోతాయి. అదీగాక, ఆ శివుడు కార్తీక పౌర్ణమినాడే త్రిపురసంహారం చేసినవాడు అవడం చేత గూడా, ఆయనను ఆ రోజున ఆరాధిస్తారు. 

  • ఇక ధనేశ్వరుడు ఈ పూజా మహోత్సవాలను అన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోను, వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరిగుతున్నాడు కాని, ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణసర్పం అతనిని కాటువేయడం, తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారకంలో వున్న అతగాడికి అక్కడి భక్తులు తులసితీర్థాన్ని సేవింపచేయడం, ఆ అనంతర క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది.

  • మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుడిని పాశబద్ధుడిని చేసి, కొరడాలతో మోదుతూ యముడి వద్దకు తీసుకువెళ్ళారు. 

  • యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ప్రారంభించగా చిత్రగుప్తుడు 'హే ధర్మరాజా! వీడు ఆగర్భ పాపత్ముడేగాని, అణువంతయినా పుణ్యం చేసినవాడు కాదు' అని చెప్పాడు. ఆ మాటమీద దండధరుడు తన దూతలచేత ధనేశ్వరుడి తలను చితగ్గొట్టించి, కుంభీపాక నరకంలో వేయించాడు.

  • కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని యముడికి విన్నవించారు. 

  • అంతకంటే అబ్బురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుడిని తన కొలువుకు పిలిపించి మళ్ళీ విచారణను తలపెడుతుండగా, అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు 'ఓ యమధర్మరాజా! ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలయిన పుణ్యాలను ఆచరించాడు గనుక, ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు. 

  • ఏవయితే పుణ్యపురుష దర్శన, స్పర్శన, భాషణలకు పాత్రులో వారు సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరవభాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటి ఈ ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులయిన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది వున్నాడు. 

  • కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీగాక అవసానవేళ హరిభక్తులచేత తులసీతీర్థం పొందాడు. కర్ణపుటాలలో హరినామస్మరణం జరుపబడింది. 

  • పుణ్యనర్మదా తీర్థాలతో విగతదేహం సుస్నాతమయ్యింది. అందరు హరిప్రియుల ఆదరణకు పాత్రుడు అయిన ఈ విప్రుడు పుణ్యాత్ముడైన ఈ భూసురుడు - పాపభోగాలయమైన నరకంలో ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు.


ఇరవై అయిదు, ఇరవై ఆరు అధ్యాయాలు సమాప్తం  


ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ సమాప్తం 

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో  ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ చూడండి

Note:

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,   కామెంట్   చేయడం మర్చిపోకండి 





27 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై ఏడవ రోజు పారాయణ

wowitstelugu.blogspot.com

27 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై ఏడవ రోజు పారాయణ


ఇరవై మూడవ అధ్యాయం

విష్ణుగణాలు చెప్పిన చోళ, విష్ణుదాసుల కథ తరువాత, ధర్మదత్తుడు మళ్ళీ వారిని 'ఓ గణాధిపతులారా! జయ-విజయులు వైకుంఠంలో విష్ణుద్వారపాలకులని విని వున్నాను. వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వలన విష్ణుస్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి' అని అడగడంతో, ఆ గణాధిపతులు చెప్పడం ప్రారంభించారు.
జయ-విజయుల పూర్వజన్మలు

  • తృణబిందుడి కూతురు దేవహుతి. ఆమెపట్ల కర్దమ ప్రజాపతి యొక్క దృష్టి స్ఖలనం జరగడం వలన ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండవవాడు విజయుడు. 
  • వాళ్ళు ఇద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు. తరువాత అష్టాక్షరీమంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేదవిదులు అయ్యారు. 
  • యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ కలిగినవారిగా ప్రసిద్ధిచెందారు. అందువలన, మరుత్తుడు అనే రాజు వీరి దగ్గరికి వచ్చి, తనచేత యజ్ఞం చేయించవలసిందిగా వాంచించాడు. 

  • అన్నదమ్ములు ఇద్దరూ కలిసివెళ్ళి, ఒకరు బ్రహ్మ, మరొకరు యాజకులుగా వుండి, ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. సంతుష్ఠుడు అయిన మరుత్తుడు వారికి లెక్కలేనంత దక్షణలు ఇచ్చాడు. 

  • ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికివారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తించాలని తలిచారు. దాని వల్ల మరుత్తుడు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికీ తగాదాలు వచ్చాయి. 

  • ఇద్దరికీ చెరిసగం అనేది జయుని వాదం కాగా, తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు. ఆ వాదోపవాద క్రోథంతో జయుడు అలిగి 'నువ్వు మోసలివై'పో అని శాపం పెట్టాడు. 

  • అంతటితో జయుడు ఊరుకోకుండా 'అహంకారంతో శపించిన నువ్వు, స్వాహంకారి అయిన సామజమై (ఏనుగు) పుడతావులే' అని ప్రతి శాపం ఇచ్చాడు. 

  • ఇలా పరస్పర శాపగ్రస్తులైన ఆ సోదరులు ఇద్దరూ విష్ణు అర్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకున్నవాళ్ళై, తమ శాపాలను అందుకు పూర్వపరాలను విన్నవించుకుని శాపవిముక్తికోసం ఆ శ్రీహరిని ఆశ్రయించారు.

  • 'హే భగవాన్! నీకు ఇంతటి చేరువ భక్తులమైన మేము మొసలిగానూ, ఏనుగుగానూ పుట్టడం చాలా ఘోరమైన విషయం. కనుక మా శాపాలనుంచి మమ్మల్ని మళ్ళించు' అని మనవి చేశారు.

  • అందుకు మందహాసం చేస్తూ శ్రీమహావిష్ణువు 'జయ-విజయులారా! నా భక్తులమాటలు పొల్లుపోనీకపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భావించాను. 
  • అంబరీషుని వాక్యం ప్రకారం వివిధ యోనులలో దశావతారాలను ధరించాను. అందువలన మీరు సత్యం తప్పనివారై, మీమీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి' అని ఆదేశించడంతో, విష్ణువు ఆదేశాన్ని శిరసావహించి ఆ జయవిజయులు ఇద్దరూ గండకీ నదీ ప్రాంతాన మకర, మాతంగాలుగా జన్మించి, పూర్వజన్మ జ్ఞానంకలవారై విష్ణు చింతనతోనే కాలం గడపసాగారు. 
  • అలా వుండగా ఒకానొక కార్తీకమాసం ప్రవేశించింది. ఆ కార్తీకమాసంలో కార్తీకస్నానం చేయాలనే కోరికతో ఏనుగు అయిన జయుడు గండకీ నదికి వచ్చాడు. 
  • నీటిలోనికి దిగిందే తడవుగా, అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటపట్టాడు. 
  • విడిపించుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహం కలవాడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు. 
  • తలచినదే తడవుగా ప్రత్యక్షమైన గరుడవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠప్రాప్తిని కలిగించాడు. 
  • తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం యొక్క ఒరిపిడివలన ఆ గండకీ నదిలోని శిలలు చక్రచిహ్నాలతో కూడుకున్నవి అయ్యాయి. 
  • ఓ ధర్మదత్తా! నీచే ప్రశ్నించబడిన విష్ణు ద్వారపాలకులైన జయవిజయులు వారిద్దరే. అందువలన నీవు కూడా దంభామాత్సర్యాలను దిగనాడి, సదర్శనుడివై, సుదర్శనాయుధుడి చరణసేవలను ఆచరించు. తులా, మకర, మేష సంక్రమణాలలో ప్రాతఃస్నానాలను ఆచరించు. 
  • తులసీవన సంరక్షణలోనూ, ఏకాదశీ వ్రతంలోనూ, నిష్ఠగలవాడివై ప్రవర్తించు. గోబ్రాహ్మణులనూ, విష్ణుభక్తులనూ సర్వదా సేవించు. 
  • కొర్రధ్యానము, పులికడుగునీరు, వంగ మొదలైన వాటిని విసర్జించు. జన్మ ప్రభృతిగా నీవు చేస్తున్న ఈ కార్తీక విష్ణు వ్రతం కంటే ఏ దాన, తపో, యజ్ఞ, తీర్థాలు కూడా గొప్పవి కావని గుర్తుంచుకో. 
  • ఓ విపృడా! దైవప్రీతికరమైన విష్ణు వ్రతాచరణం వల్ల నీవూ, నీ పుణ్యంలో సగభాం అందుకోవడం వలన ఈ కలహ కూడా ధన్యులు అయ్యారు. 
  • ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకుని వెడుతున్నాము' అని విష్ణుగణాలు ధర్మదత్తునికి హితవు పలికి, అతనిని తిరిగి విష్ణువ్రత విశిష్టతలు తెలిపి కలహ సమేతంగా విమానంపై వైకుంఠానికి ప్రయాణమయ్యారు. 

నారదుడు చెబుతున్నాడు: 

ఓ పృథురాజా! అతి పురాతనమైన ఈ పుణ్య ఇతిహాసాన్ని ఏ మానవుడు అయితే వింటున్నాడో, ఇతరులకు వినిపిస్తున్నాడో, వాడు శ్రీమహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు.

ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం

ఇరవై నాలుగవ అధ్యాయం

నారదుడు చెప్పినది అంతా విని, ఆశ్చర్యచికితుడైన పృథు చక్రవర్తి...
'హే దేవర్షీ! ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం, గండకీనదులు లాగానే గతంలో కృష్ణా, సరస్వతీ మొదలైన నదుల గురించి విన్నాను. ఆ మహామహిమలు అన్నీ ఆ నదులకు చెందినవా? లేక ఏ క్షేత్రాలకు చెందినవో విశదపరచవే' అని కోరగా, 
మరలా నారదుడు చెప్పసాగాడు
'శ్రద్దగా విను... 
కృష్ణానది సాక్షాత్తూ విష్ణుస్వరూపం. సరస్వతీనది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది.

కృష్ణా - సరస్వతీ నదుల ప్రాదుర్భావము
  • ఒకానొక చాక్షుష మన్వంతరంలో, బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై యజ్ఞం చేయడానికి సమాయత్తం అయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలూ, మునులు కూడా యజ్ఞానికి విచ్చేశారు. 

  • భృగువు మొదలైన మునులు అందరూ కలిసి ఒకానొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష ఇవ్వడానికి నిర్ణయించి, కర్త యొక్క కలత్రమయిన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు. 

  • దీక్షా ముహూర్తం అతిక్రమించకూడదనే నియమం వలన భృగుమహర్షి 'హే విష్ణూ! సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు. 

  • ముహూర్తం దాటిపోతోంది. ఇప్పడు ఏమిటి గతి?' అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ 'సరస్వతి రానిపక్షంలో, బ్రహ్మకు మరియొక భార్య అయిన గాయత్రిని దీక్షాసతిగా విధించండి' అని సలహా ఇచ్చాడు. 

  • ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగుమహర్షి గాయత్రిని రప్పించి, బ్రహ్మ యొక్క దక్షిణభాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు. 

  • ఆ విధంగా ఋషులు అందరూ పూర్తిచేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలు అయి ఉన్న తన సవతి గాయత్రిని చూసి కోపంతో
సరస్వతి ఉవాచ :

శ్లో     అపూజ్యాయత్ర పూజ్యంతే, పూజ్యనాంచ వ్యతిక్రమః 
         
త్రీణి త్రత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం!!

  • 'ఎక్కడ అయితే పూజార్హత లేనివారు పూజింపబడుతున్నారో, మరియు పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు, భయము, మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి. 

  • ఈ బ్రహ్మకు దక్షిణభాగాన నా స్థానంలో ఉపవిష్టురాలిన ప్రజలకు కనిపించనటువంటి రహస్య నదీరూపాన్ని పొందుగాక! ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా! మీరందరూ ఈ యజ్ఞవాటికలో వుండికూడా, నా సింహాసనంలో, నాకన్నా చిన్నదాన్ని ఆసీనురాలిని చేశారు కాబట్టి, మీరు కూడా జడీభూత నదీరూపాలను పొందండి' అని శపించింది.  

  • ఆ సరస్వతీదేవి కృద్ధ  మాటలను వింటూనే, చివ్వున లేచిన గాయత్రి, దేవతలు వారించుతున్నా సరే వినకుండా 'ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో, అదే విధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు కాబట్టి నువ్వు కూడా నదీరూపాన్ని పొందు' అని ప్రతిశాపం ఇచ్చింది. 
  • ఈ లోపల హరిహరులు వారిని సమీపించి, 'మేము నదీమయులం అయినట్లయితే లోకాలు అన్నీ అతలాకుతలమయి పోతాయి. గనుక, అవివేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్ళించుకో' అన్నారు. 
  • కాని, ఆమె వినలేదు. 'యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వరపూజ చేయకపోవడం వలననే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమయ్యింది. పలుకుల పడతినైన నా మాట తప్పదు, మీరందరూ నదీరూపాలను ధరించి, మీ అంశలు జడత్వాన్ని వహించవలసినదే.
  • సవతులమైన నేనూ, గాయత్రీ కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నము' అని చెప్పింది. 
  • ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలూ జడాలుగానూ, రూపాలు నదులుగానూ పరిణమించాయి. 
  • ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగానూ, శివుడు సరస్వతీనదిగానూ, బ్రహ్మ పద్మినీ నదిగానూ, ఇతరేతర దేవతలు ఇతరేతర నదీ రూపాలుగానూ మారిపోయారు.

  • దేవతలందరూ నదులై తూర్పుముఖంగానూ, వారివారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించనారంభించారు. 

  • గాయత్రీ, సరస్వతీ నదీరూపాలు 'సావిత్రీ' అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్టితులైన శివకేశవులు, మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు. 

  • సర్వపాపహరమైన ఈ కృష్ణానదీ ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివిన, వినినా, వినిపించినా, వారి వంశం అంతా కూడా నదీదర్శన స్నానపుణ్య ఫలవంతమై తరించిపోతారు.
 ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు సమాప్తం
 
ఇరవై ఏడవ రోజు పారాయణ సమాప్తము 
ఈ క్రింద కార్తీక పురాణము విశిష్టత - ఇరవై ఏడవ రోజు పారాయణ వీడియో యు. ఆర్. యల్.లు చూడండి




Note:

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,   కామెంట్   చేయడం మర్చిపోకండి

Today's  Quote..
"Your true success in life begins only when you make the commitment to become excellent at what you do." -Brian Tracy



26 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై ఆరవ రోజు పారాయణ

wowitstelugu.blogspot.com

26 కార్తీక పురాణము విశిష్టత -  ఇరవై ఆరవ రోజు పారాయణ


ఇరవై ఒకటవ అధ్యాయం 

విష్ణు గణాలు చెప్పినది అంతా విని - విస్మృతచేష్టుడూ, విస్మయ రూపుడూ అయిన ధర్మదత్తుడు తిరిగి వారికి దండప్రమాణాలు ఆచరించి, 'ఓ విష్ణు స్వరూపురాలా! ఈ జనానికి అంతా అనేకానేక క్రతు వ్రత దానాలచేత నా కమలనాభుడిని సేవించుకుంటూ వున్నారు. వాటి అన్నింటిలోనూ ఏ ఒక్కదాన్ని ఆచరించడం వలన విష్ణువుకి అత్యంతమైన ప్రీతి కలుగుతుందో, దేనివలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని శలవీయండి' అని వేడుకున్న తరువాత...

విష్ణుగణాలు అతన్ని ఇలా సమాధానపరచసాగాయి. 

  • 'పాపరహితుడవైన బ్రాహ్మణుడా! నీవు అడిగిన ప్రశ్నకు ఇతిహాస పూర్వకమైన సమాధానాన్ని చెబుతాను విను. 

  • పూర్వం కాంచీపురాన్ని 'చోళుడు' అనే రాజు పరిపాలించేవాడు. అతని పేరుమీదనే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించాయి. ధర్మపాలనకు పెట్తింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికి అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు. 

  • అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు ధూపస్తంభాలతో, తామ్రపర్ణి నది యొక్క రెండు తీరాలూ కూడా కుబేర ఉద్యానవనములైన 'చైత్రరథా'ల వలె ప్రకాశించేవి.

  • అటువంటి రాజు ఒకానొకనాడు 'అనంతశయన' అనే పేర యోగ నిద్రాముద్రితుడై ఉండే విష్ణు ఆలయానికి వెళ్ళి, మణిమౌక్తిక సువర్ణ పుష్పాలతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండప్రమాణాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీవారి సన్నిధిలోనే కూర్చున్నాడు. 

  • అంతలోనే, 'విష్ణుదాసు' అనే బ్రాహ్మణుడు ఒకడు విష్ణు అర్చనకోసం ఆ ఆలయానికి వచ్చాడు. విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు విష్ణు సంజ్ఞను అభిషేకించి, తులసిదళాలతోనూ, గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వహించాడు. 

  • అది చూసి రాజుకు కోపం వచ్చింది. అ కోపంలో తాను ధర్మవేత్త అయి కూడా, అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజాత్యాన్ని విస్మరించి, 'ఓరి విష్ణుదాసుడా! నేను మాణిక్యాలతోనూ, బంగారు పువ్వులతోనూ చేసిన పూజవలన ప్రకాశమానుడు అయిన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా? నేను ఎంతో భక్తితో ఆచరించిన పూజని ఇలా పాడు చేశావు అంటే, అసలు నీకు విష్ణుభక్తి టే ఏమిటో తెలుసా?' అని చీదరించుకున్నాడు. 

  • ఆ మాటలకు ఈ బ్రాహ్మణుడికి కూడా కోపం వచ్చింది. అవతలి వ్యక్తి 'రాజు' అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి 'ఓ రాజా! నీకు దైవభక్తి లేదు. సరికదా! రాజ్య ఐశ్వర్య మత్తులో ఉన్నావు. విష్ణు ప్రీత్యర్థం నీ చేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటి వుంటే చెప్పు' అని ఎదిరించాడు. 

  • అతని మాటలకు అవహేలనగా నవ్వుతూ 'నీ మాటలవలన నీవే విష్ణుభక్తి శూన్యుడివి అని తెలుస్తూ వుంది. ధనహీనుడవూ, దరిద్రుడివీ అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది. 

  • అసలు నీవు ఎప్పుడయినా విష్ణుప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా? కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా? ఏమీ చేయలేనివాడివైన నీకు భక్తుడు అనే ఆహాకారం మాత్రం అధికంగా వుంది. 

  • ఓ సదస్యులారా! సద్రాహ్మణులారా శ్రద్ధగా వినండి. నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మణుడు పొందుతాడో నిదానించి చూడండి. 

  • అంతటితో మా యిద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది' అని, ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి, చోళుడు స్వగృహానికి వెళ్ళి 'ముద్గలుడు' అనే మునిని ఆచార్యుడిగా చేసుకుని విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు. 

  • బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయములచేత చేయబడినదీ, అన్నదానాలూ, అనేకానేక దక్షిణాలతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిదీ, సర్వసపృద్ధివంతమైనదీ అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు. 

  • పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణుదీక్షితుడై, హరిప్రీతికై ఆచరించాల్సిన మాఘ, కార్తీక వ్రతాచరణలూ, తులసి వన సంరక్షణలూ, ఏకాదశినాడు ద్వాదశాక్షరీయుత విష్ణుజపం, షోడశోపచార విధిని నిత్యపూజలనూ, నృత్యగీత వాయిద్యాది మంగళధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు. 

  • నిత్యమూ సర్వవేళలలోనూ, భోజన సమయాలలోనూ, సంచారమందూ, చివరికి నిద్రలో కూడా హరినామ స్మరణను చేస్తూ, ప్రత్యేకించి మాఘ కార్తీకమాసాలలో విశేష నియమపాలన ఆచరిస్తూ ఉన్నాడు.

  • ఆ విధంగా భక్తులైన చోళ, విష్ణుదాసులు ఇద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలనూ వ్రతనిష్ఠలోనే నిలిపి, విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలాకాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే వుండిపోయారు.


ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తం


ఇరవై రెండవ అధ్యాయం


  • కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోయారు. 

  • ఆ దొంగలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు. కాని, తిరిగి వంటప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతూ ఉండడంతో ఆ రోజుకు భోజనం చేయకుండానే విష్ణుపూజలో గడిపేశాడు. 

  • మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలనే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు. 

  • విష్ణుపూజకు వేళ దాటిపోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు భోజనం చేయకుండానే హరిసేవను కొనసాగించాడు. 

  • ఇలా వారంరోజులు గడిచాయి. ప్రతిరోజూ అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగాలిస్తూనే వున్నారు. 

  • అతను పస్తులు ఉంటూ కూడా హరిసేవ చేస్తూనే వున్నాడు. వారం రోజులపాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసుడికీ, ఆ దొంగను పట్టుకోవాలని అనిపించింది.

  • అందువల్ల ఒకనాడు చాలా పెందరాళే వంట ముగించుకుని, వంటకాలను పూర్వ స్థానంలోనే వుంచి, తాను ఒక చోట దాగి కూర్చుని, దొంగకోసం ఎదురుచూడసాగాడు. కాసేపటికి ఒకానొక ఛండాలుడు ఆ అన్నాన్ని దొంగలించడానికి వచ్చాడు. 
  • వాడి ముఖం అత్యంత దీనంగా ఉండి. రక్తమాంసాలు ఏమాత్రం లేకుండా కేవలం ఎముకలమీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడూ, అన్నార్తుడూ అయిన ఆ ఛండాలుడు వంటకాలను దొంగిలించుకుని వెళ్ళిపోసాగాడు. అతని దైన్యస్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో వున్న బ్రాహ్మణుడు 'ఓ మహాత్మా! కాసేపు ఆగవయ్యా! ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం. 

  • ఈ నేతిని కూడా పట్టుకుని వెళ్ళు' అంటూ నేతిఝారీతో సహా అతని వెంటపడ్డాడు. ఆ బ్రాహ్మణుడు తనను బంధించి రాజభటులకు అప్పగించుతాడు అనే భయంతో ఆ ఛండాలుడు పరుగుతీయడం ప్రారంభించాడు. ఈ బ్రాహ్మణుడు వెనకాలనే పరుగు పెడుతూ 'అయ్యా! నెయ్యి తీసుకుని వెళ్ళి కలుపుకుని తినవయ్యా స్వామీ' అని అరుస్తూనే వున్నాడు. 

  • అసలే అలసటగా వున్న ఛండాలుడు భయంవలన నేలపై పడి మూర్చపోయాడు. అతనిని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు 'అయ్యో! మూర్ఛపోయావా మహాత్మా!' అంటూ తన పైటచెంగులతో ఆ ఛండాలుడికి విసరసాగాడు. ఆ సేవవల్ల అతి శీఘ్రంగా కోలుకున్న ఛండాలుడు, చిరునవ్వు నవ్వుతూ లేచాడు. 

  • ఇప్పుడు అతను విష్ణుదాసుని కళ్ళకు శంఖచక్ర గదాధారీ, పీతాంబరుడూ, చతుర్భుజుడూ, శ్రీవత్సలాంచితుడు, కౌస్తుభా అలంకృతుడూ అయిన శీమన్నారాయణుని వలె గోచరించడంతో, అతగాడు సాత్త్విక భావావృతుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు. 

  • ఆ భక్త, భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులు ఎందఱో వినానారూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు. విష్ణువుమీదా, విష్ణుదాసుడి మీదా కూడా విరివాన కురిపించారు. 

  • అప్సరసలు ఆడారు, గంధర్వులు పాడారు, దేవగణాలయొక్క వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లు అనిపించింది. 

  • తరువాత ఆ ఆదినారాయణుడు విష్ణుదాసుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతోబాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయల్దేరాడు. 

  • యజ్ఞవాటికలో వున్న చోళుడు ఆకాశంలో ప్రయాణిస్తున్న బ్రాహ్మణ బ్రహ్మ జనకులు ఇద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు. 

  • తక్షణమే తన ఆచార్యుడిని పిలిచి 'ఓ ముద్గలమునీ! నాతొ వివాదపడిన ఆ నిరుపేద విపృడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు. 

  • అత్యంత ఐశ్వర్యవంతుడిని అయిన నేను అసాధ్యాలయిన యజ్ఞ దానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం సంగతేం కాను.

  • నేను ఎన్ని యజ్ఞాలను చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణాలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నామీద లేశమైనా కృపకలిగినట్లు లేదు. 

  • దీన్ని బట్టి కేవలం భక్తియే తప్ప విష్ణువు అనుగ్రహానికి మరొక మార్గం లేదు. ఈ యజ్ఞ యాగాది కర్మకాండలు అన్నీ అనవసరంగా భావిస్తున్నాను' అని చెప్పాడు. 

  • బాల్యం నుంచీ యజ్ఞ దీక్షలోనే వుండటం వలన నిస్సంతుడయిన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లుడికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు.


శ్లో     తస్మాదద్యాపి తద్దేశే సదారాజ్యంశ భాగినః 
        స్వ శ్రీయామేవ జాయంతే తత్కృతావిధి పరివర్తనః !!

ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా చోళదేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనళ్ళుల్లే కర్తలు అవుతూ ఉన్నారు.

తరువాత చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరకు చేరి, 'ఓ శ్రీహరీ! త్రికరణశుద్ధిగా నీ భక్తిని నాయందు సుస్థిరం చేయి తండ్రీ!' అని ప్రార్థించి, సమస్త సదస్యులూ చూస్తుండగానే అగ్నిప్రవేశం ఆచరించాడు.


శ్లో     ముద్గలస్తు తతః క్రోథా చ్చిఖ ముతపాతయిన్ స్యకాం 
          అట స్త్వద్యాపి తద్గోత్రే ముద్గలా విశిఖా భవన్!!

అది చూసి కుద్దుడైన ముద్గులుడు తన శిఖను పెరికివేసుకున్నాడు. అది మొదలు ఆ గోత్రం ఈనాటికీ 'విశిఖ'గానే వర్థిల్లుతుంది.

హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులో అగ్నినుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు. చోళుడిని ఆలింగనం చేసుకుని, అతనికి సారూప్యన్ని అనుగ్రహించి, అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు. 

ఓ ధర్మదత్తా! ఆ రోజున ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసునూ, ఇటు చోళుడినీ కూడా అనుగ్రహించి, సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠంలో ద్వారపాలకులుగా చేసుకున్నాడు. 

కాబట్టి, ఓ బ్రాహ్మణుడా! విష్ణువు అనుగ్రహానికీ, విష్ణువు సాక్షాత్కారానికీ రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం, అది భక్తి మార్గమే. ఆ మార్గాలు రెండూ ఒకటి ఆత్మజ్ఞానం, రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తుడికి బోధించి, విష్ణు స్వరూపులు మానం వహించారు.


ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు సమాప్తం 

ఇరవై ఆరవ రోజు పారాయణ సమాప్తం

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో 26వ రోజు పారాయణం చూడండి 

Search Results

Note:

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,   కామెంట్   చేయడం మర్చిపోకండి