27, నవంబర్ 2020, శుక్రవారం

22 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై రెండవ రోజు పారాయణము

wowitstelugu.blogspot.com

22 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై రెండవ రోజు పారాయణము

కార్తీక పురాణము - ఇరువైరెండవ రోజు పారాయణ 

పదమూడవ అధ్యాయం 


నారద ఉవాచ: 

ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, కోపోద్రిక్తుడైన జలంధరుడు శివుడిమీద రణభేరీ వేయించాడు.

కోట్లాది సేనలతో - కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరుడికి అగ్రభాగాన వున్న శుక్రుడు రాహువుచేత చూడబడ్డాడు. 

తత్ఫలితంగా జలంధరుడి కిరీటం జారి నేలపై పడింది. 

రాక్షససేనా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం, వర్షకాలపు మేఘావృత్తమైన ఆకాశంవలే కనిపించసాగింది. 

ఈ రణోద్యోగాన్ని ఎరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందు ఉంచుకుని రహస్యమార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి యుద్ధవార్తల్ని విన్నవించారు. 

'ఓ దేవాధిదేవా! ఇన్నినాళ్ళుగా వాడివల్ల మేము పడుతున్న ఇక్కట్లు అన్నీ నీకు తెలుసు. ఈవేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు. 

సర్వలోక కళ్యాణార్థం, మా రక్షణార్థం వాడిని జయించు తండ్రీ!' అని ప్రార్థించారు.

వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు, విష్ణువు వచ్చాడు. అప్పుడు శివుడు ఆయనని 'కేశవా! గత జగడంలోనే ఆ జలంధరుడిని యమునిపాలు చేయకపోయావా? పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదలి వాడి ఇంట్లో కాపురం ఉండడం ఏమిటి?' అని ప్రశ్నించాడు. 

అందుకు జవాబుగా విష్ణువు 'పరమేశ్వరా! ఆ జలంధరుడు నీ అంశవలన పుట్టడంచేతా, లక్ష్మికి సోదరుడు కావడంచేతా, యుద్ధంలో నాచేత వధింపబడలేదు. కాబట్టి నువ్వే వాడిని జయించు' అని చెప్పాడు. 

అందుమీదట శివుడు 'ఓ దేవతలారా! వాడు మహా పరాక్రమవంతుడు. ఈ శాస్త్రాలవల్లగాని, నా చేతగాని మరణించేవాడు గాడు. కాబట్టి, మీరందరూ కూడా ఈ అస్త్రశాస్త్రాలలో మీమీ తేజస్సులను సయితం ప్రకాశింపచేయాలి' అని ఆజ్ఞాపించడంతో, విష్ణ్వాది దేవతలందరూ తమతమ తేజస్సులను బయల్పరిచారు. 

గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి, మహోత్తమమూ, భీషణ జ్వాలాసముదాయసంపన్నమూ, అత్యంత భయంకరమూ అయిన 'సుదర్శన'మనే చక్రాన్ని వినిర్మించాడు.

అప్పటికే ఒకకోటి ఏనుగులు, ఒకకోటి గుర్రాలు, ఒకకోటి కాల్బలగముతో కైలాస భూములకు చేరిన జలంధరుణ్ణి, దేవతలూ, ప్రమథగణాలు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి.

నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమతమ గణాలతో జలంధరుడిని ఎదుర్కొన్నారు. 

రెండు తెగల మధ్యనా భయంకరమైన సంకుల సమరం కొనసాగింది. ఇరుపక్షాల నుంచీ వచ్చే వీరరస ప్రేరకాలయన భేరీ మృదంగ శంఖాది ధ్వనులతోనూ, రథనేమీ ధ్వనులతోనూ, గజ ఘీంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది.

పరస్పర ప్రయోగితాలైన - శూల, పట్టిస, తోమర, బాణ, శక్తి, గదాద్యాయుధభరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగావుంది. 

యుద్ధభూమిలో నేలకూలిన రధగజాదుల కళేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలుగా పడినట్లుగా ఉన్నాయి. 

ఆ మహాహవంలో ప్రమథగణోపహతులైన దైత్యులని శుక్రుడు మృత సంజీవనీ విద్యతో పునర్జీవింప చేయసాగాడు. ఈ సంగతి ఈశ్వరుడి చెవినబడింది. 

తక్షణమే ఆయన ముఖంనుంచి కృత్య అనే మహాశక్తి ఆవిర్భవించింది. అది, అత్యంత భయంకరమైన తాలుజంఘోదర వక్త్రస్తనాలతో మహావృక్షాలను సైతం కూలగోడుతూ రణస్థలి చేరింది.


శ్లో  || సా యుద్ధభూమి మాసాద్య భక్షయంతీ మహాసురాన్ 
         భార్గవం స్వభగేధృత్వా జాగా మాంతర్హితా సభః !!


రావడం రావడమే పేరుమోసిన రాక్షసులెందరినో తినేసింది. ఆ వూపుఊపు శుక్రుణ్ణి సమీపించి అతనిని తన యోనిలో చేర్చుకుని అంతర్థానమైపోయింది.

మరణించినవాళ్ళను మళ్ళా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమాదగణాల విజృంభనకు రాక్షససేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకలవలె చెల్లాచెదరయిపోసాగింది. 

అందుకు కినిసిన శుంభనిశుంభ కాలనేమ్యాది సేనానాయకులు అగణిత శరపరంపరతో శివగణాలను నిరోధించసాగారు. 

ఎంచక్కటి పంటమీద మిడతల దండులాగా తమమీదపడే రాక్షసబాణాలకు రక్తసిక్త దేహులై, అప్పుడే పూసిన మోదుగ చెట్లవలె తయారయిన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగారు. 

అది గమనించిన నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర ఆగ్రహావేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు. 


పదమూడవ అధ్యాయం సమాప్తం

పదనాల్గవ అధ్యాయం 

నందేశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శుంభుడితోనూ, కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. 

నిశుంభుడి బాణాఘాతానికి సుబ్రహ్మణ్యస్వామి వాహనమైన నెమలి మూర్ఛపోయింది. నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలనూ, జెండానూ, ధనుస్సునూ, సారథినీ నాశనం చేసేశాడు. 

అందుకు కోపంతో కాలనేమి నందీశ్వరుడి ధనుస్సును ఖండించాడు. 

క్రుద్దుడయిన నంది శూలాయుధంతో కాలనేమిని ఎదుర్కొన్నాడు. 

కాలనేమి ఒక పర్వత శిఖరాన్ని పెకలించి నందిని మోదాడు. 

నంది మూర్ఛపోయాడు. వినాయకుడు తన బాణాలతో శుంభుడి సారధిని చంపేశాడు.

అందుకు కోపంతో శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణాలతో బాధించాడు.

అది కదలలేని పరిస్థితి ఏర్పడటంతో, వినాయకుడు గండ్రగొడ్డలిని ధరించి - కాలినడకన శుంభుడిని చేరి వాడి వక్షస్థలాన్ని గాయపరిచాడు. 

వాడు భూమిపై పడిపోయాడు. అది గమనించిన కాలనేమి, నిశుంభులిద్దరూ ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు. 

ఇది గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు. వినాయకుడికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూశ్మాండ-భైరవ-భేతాళ-పిశాచ-యోగినీగణాలన్నీ ఆయనను అనుసరించాయి. 

గణసహితుడైన వీరభద్రుడి విజృంభనతో రాక్షసగణాలు హాహాకారాలు చేశాయి. అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వర, కుమారస్వాములు ఇద్దరూ పునః యుద్ధంలో ప్రవేశించారు.

వాళ్ళందరి విజృంభనతో వీగిపోతూన్న తన బలాన్ని చూసిన జలంధరుడు 'అతి' అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలనూ ఎదుర్కొన్నాడు. 

జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాలమధ్య ప్రాంతమంతా నిండిపోయింది. అయిదు బాణాలతో విఘ్నేశ్వరుడినీ తొమ్మిది బాణాలతో నందీశ్వరుడినీ, ఇరవై బాణాలతో వీరభద్రుడినీ కొట్టి మూర్ఛపోగొట్టి, భీషణమైన సింహగర్జన చేశాడు. వాడి గర్జనతో ముందుగా స్పృహలోకి వచ్చిన వీరభద్రుడు - ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాలనీ, పతాకన్నీ, గొడుగునూ నరికేశాడు. 

మరో మూడు బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు. దానితో మండిపడిన జలంధరుడు 'పరిఘ' అనే ఆయుధంతో వీరభద్రుడిని ఎదుర్కొన్నాడు. 

అద్బుతమైన యుద్ధం చేశారు వాళ్ళు. అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు విగత స్పృహుడయ్యాడు.


పదమూడు పద్నాలుగు అధ్యాయాలు సమాప్తం

ఇరువైరెండవ (బహుళ సప్తమి)రోజు పారాయణ సమాప్తం. 
 
ఈ క్రింది 22 వ రోజు వీడియో యు .ఆర్.యల్ లు చూడండి 


Note:
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందిథాంక్యూ.


26, నవంబర్ 2020, గురువారం

21 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై ఒకటవ రోజు పారాయణము

wowitstelugu.blogspot.com

21 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై ఒకటవ రోజు పారాయణము


పదకొండవ అధ్యాయము

మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడించవస్తున్న జలంధరుడికి భయపడినవారై దేవతలు అంతా విష్ణు స్తోత్రం చేయసాగారు.

సర్వదేవతా కృత విష్ణు స్తోత్రం

శ్లో||      నమో మత్స్య కుర్మాది నానా స్వరూపై 

    సదాభక్త కార్యోద్యతా యార్తి హంత్రే 

    విధాత్రాధి  పరగస్థితి ధ్వంసకర్త్రే 

    గదాశంఖ సద్మాసి హస్తయతే స్తు || 1 ||


            రమావల్లభో యసురాణాం నిహంత్రే 

            భుజంగారి యానాయ పీతాంబరాయ 

            మఖాది క్రియాపాకకర్త్రే వికర్త్రే 

            శరణ్యాయ తస్మై వతాస్మొనతాస్మః || 2 || 

 

   నమో దైత్య సంతాపి తామర్త్యదుఃఖా  

   చల ధ్వంసదంభోళయే విష్ణవేతే 

   భుజంగేళ టేల్ శయా నార్కచంద్ర 

             ద్వినేత్రాయ తస్మై నతాస్మో నతాస్మః || 3 ||


నారద ఉవాచ:

 సంకష్ట నాశనం స్తోత్ర మేతద్యస్తు పఠేన్నరః 

 స కదాచిన్న సంకష్టైః పీడ్యతే కృపయాహరేః


మత్స్యకూర్మాది అవతారములు ధరించినవాడునూ - సదా భక్తుల యొక్క కార్యములు చేయుటయందు సంసిద్ధుడగువాడును, దుఃఖములను నశింపచేయువాడును, బ్రహ్మాదులను సృష్టించి, పెంచి, లయింపచేయువాడును, గద, శంఖం, పద్మం, కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించినవాడును యగు నీకు నమస్కారము.

(1)  

లక్ష్మీపతి, రాక్షసారతి గరుడవాహనుడు, పట్టుబట్టలు ధరించినవాడును, యజ్ఞాదులకు కర్త, క్రియారహితుడు, సర్వ రక్షకుడవూనగు నీకు నమస్కార మగునుగాక.

(2)

రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపజేయుటలో వజ్రాయుధమువంటి వదవును, శేషశయనుడవును, సూర్యచంద్రులనే నేత్రములుగా గలవాడవును యగు ఓ విష్ణూ! నీకు నమస్కారము. పునః పునః నమస్కారము.

(3)

ఇలా దేవతలచేత రచించబడినదీ, సమస్త కష్టాలను సమయింప చేసేదీ అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడు అయితే పఠిస్తూ ఉంటాడో వాడి యొక్క ఆపదలన్నీ ఆ శ్రీహరి దయవలన తొలగిపోతాయి' అని పృథువుకు చెప్పి, నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు. 

  • ఈ దేవతల స్తోత్రపాఠాలు ఆ చక్రపాణి చెవినపడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తూనే, దానవులపై కోపం గలవాడై చయ్యన తన శయ్యవీడి, గరుడవాహనంవైపు కదులుతూ 'లక్ష్మీ! నీ తమ్ముడైన జలంధరుడికీ-దేవగణాలకి యుద్ధం జరుగుతుంది. దేవరలు నన్ను ఆశ్రయించారు. నేను వెడుతున్నాను' అని చెప్పాడు. 

  • ఇందిరాదేవి రవంత చలించినదై 'నాథా! నేను నీకు ప్రియురాలనై ఉండగా నా తమ్ముడిని వధించడం ఎలా జరుగుతుంది?' అని ప్రశ్నించింది. ఆ మాటకి ఆ మాధవుడు నవ్వి 'నిజమే దేవీ! నాకు నీ మీదనున్న ప్రేమచేతా, బ్రహ్మనుండి అతను పొందిన వరముల చేతా, శివాంశసంజాతుడు కావడం చేతా జలంధరుడు నాచేత చంపదగినవాడు కాదు' అని మాత్రం చెప్పి, సర్వాయుధ సమీకృతుడై, గరుడ వాహనారూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు.

  • మహాబలియైన గరుడుడి రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షససేనలు మేఘశకలాలవలె చెల్లాచెదురై నేల రాలిపోసాగాయి. అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి ఎగిరి విషువును ఎదిరించాడు. వారిమధ్యన జరిగిన ఘోరయుద్ధం వలన, ఆకాశమంతా బాణాలతో కప్పబడిపోయింది. 

  • అద్భుతకర్ముడైన శ్రీహరి అనేక బాణాలతో జలంధరుడియొక్క జెండానీ, రథచక్రాలనీ ధనుస్సునీ చూర్ణం చేసేశాడు. అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని వేశాడు. ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడుని తలపై మోదడంతో, గరుత్మంతుడు భూమికి వాలాడు. 

  • తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు. అలిగిన యసురేంద్రుడు - ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు. అక్కడితో జలశాయికీ, జలంధరుడికి బాహుయుద్ధం ఆరంభమయింది. 

  • ఆ ముష్టిఘాతాలకు, జానువుల తాకిళ్ళకీ భూమిమొత్తం ధ్వనిమయమై పోసాగింది. భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుడి జలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్షణుడు 'నీ పరాక్రమం నన్ను ముగ్దుడిని చేసింది. ఏదైనా వరం కోరుకో' అన్నాడు. 

  • విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి 'బావా! రమారమణా! నీవు నాయందు నిజంగా ప్రసన్నుడవు అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవగణాలతోనూ సహా తక్షణమే వచ్చి నాయింట కొలువుండిపో''మ్మని కోరాడు.

  • తాను ఇచ్చిన మాట ప్రకారం మహావిష్ణువు తక్షణమే దానవ మందిరానికి తరలివెళ్ళాడు. 

  • సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్టించాడు జలంధరుడు. దేవ, స్థిత, గంధర్వాదులు అందరివద్ద ఉన్న రత్నసముదాయాన్ని అంతటినీ స్వాధీనపరచుకున్నాడు. 

  • వాళ్ళనందరినీ తన పట్టణంలో పడివుండేటట్లుగా చేసుకుని, తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు. ఓ పృథుచక్రవర్తీ! ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన యింట కొలువు ఉంచుకుని, భూలోకమంతటినీ ఏకాచ్చద్రాదిపత్యంగా ఏలుతుండగా, విష్ణుసేవా నిమిత్తంగా నే (నారదుడు) ఒకసారి ఆ జలంధరుడి ఇంటికి వెళ్ళాను.

పదకొండవ అధ్యాయం సమాప్తం

పన్నెండవ అధ్యాయం

నారదుడు చెబుతున్నాడు

పృథురాజా! అలా తన గృహానికి వెళ్ళిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తిప్రపత్తులతో శాస్త్రవిధిగా సత్కరించి, తరువాత 'మునిరాజా! ఎక్కడ నుంచి ఇలా విచ్చేశావు? ఏయే లోకాలు సందర్శించావు? నువ్వు వచ్చిన పని ఏమిటో చెబితే, దానిని తప్పక నెరవేర్చుతాను' అన్నాడు. అప్పుడు నేను ఇలా అన్నాను.

'జలంధరా! యోజన పరిమాణమూ, పొడవూ గలదీ అనేకానేక కల్పవృక్షాలను, కామధేనువులనూ గలదీ - చింతామణులచే ప్రకాశవంతమైనదీ అయిన కైలాసశిఖరంపై - పార్వతీ సమేతుడు అయిన పశుపతిని సందర్శించాను. 

ఆ విభవాలకు దిగ్భ్రాంతుడినయిన నేను అంతటి సంపదకలవారు మరెవరయినా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి అయిన నువ్వు స్ఫురించావు. నీ సిరిసంపదలను కూడా చూసి - నువ్వు గొప్పవాడివో, ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని యిలా వచ్చాను. 

అన్ని విషయాల్లోనూ మీరిద్దరూ దీటుగానే వున్నారుగాని ఒక్క స్త్రీ రత్నపు ఆధిక్యతవల్ల, నీకన్నా ఆ శివుడే ఉత్కృష్టవైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు. నీ యింట్లో అచ్చరలు, నాగకన్యలు మొదలైన దేవకాంతలు ఎందరయినా ఉందురుగాక, వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏణాంకధారికి ప్రాణాంక స్థిత అయిన పార్వతీదేవి ముందు ఎందుకూ కొరగారు.

కళ్యాణాత్పూర్వం వీతరాగుడయిన విషమాంబకుడు సైతం యే విదుల్లతా సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలే కొట్టుమిట్టాడాడో అటువంటి అద్రినందనకేనా ఈడుకాలేదు. 

నిత్యమూ ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడుపేనని తెలుసుకో. 

నీకెన్ని సంపదలున్నప్పటికీకూడా అటువంటి సాధ్వీమణి లేకపోవడంవలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివుడికి తర్వాత వాడివేగాని, ప్రథముడివి మాత్రం కావు.

ఉపర్యుక్తవిధంగా, జలంధరుడితో ఉటంకించి, నా దారిన నేను వచ్చేశాను. అనంతరం, పార్వతీ సౌందర్య ప్రలోభుడై, జలంధతీరుడు మన్మధబగ్వగ్రస్తుడు అయ్యాడు. కాముకులకి యుక్తాయుక్త విచక్షణలు ఉండవుగదా! అందువల్ల విష్ణుమాయా మొహితుడు అయిన ఆ జలంధరుడు సింహికానందనుడయిన 'రాహు' అనే వాణ్ణి చంద్రశేఖరుడి దగ్గరికి దూతగా పంపించాడు. 

శుక్లపక్షపు చంద్రుడిలా తెల్లగా మెరిసిపోతూ ఉండే కైలాసపర్వతాలు అన్నీ, తన యొక్క కారునలుపు దేహకాంతులు సోకి నల్లబడుతుండగా రాహువు కైలాసాన్ని చేరి, తన రాకను నందీశ్వరుడిద్వారా నటరాజుకు కబురుపెట్టాడు. 

'ఏం పనిమీద వచ్చావు?' అన్నట్లు కనుబొమ్మల కదలికతోనే ప్రశ్నించాడు శివుడు. రాహువు చెప్పసాగాడు ...

ఓ కైలాసవాసా! ఆకాశంలోని దేవతలచేతా, పాతాళంలోని ఫణులచేతా కూడా సేవింపబడుతున్నవాడు, ముల్లోకాలకూ ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు. 

హే వృషధ్వజా! వల్లకాటిలో నివసించేవాడివీ, ఎముకల పోగులను ధరించేవాడివీ, దిగంబరుడివీ అయిన నీకు హిమవంతుడి కూతురూ, అతిలోక సౌందర్యవతీ అయిన పార్వతి భార్యగా పనికిరాదు. 

ప్రపంచంలోని అన్నిరకాల రత్నాలకూ నేను రాజునివున్నాను. కాబట్టి, స్త్రీ రత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్తని అవడానికి నేనే అర్హుడినిగాని, నువ్వేమాత్రమూ తగవు.


కీర్తిముఖ ఉపాఖ్యానము

  • రాహువు ఇలా చెబుతుండగానే ఈశ్వరుడియొక్క కనుబొమ్మలవలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వనికలవాడు ఆవిర్భవించాడు. పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లంఖించబోగా - రాహువు భయపడి పారిపోబోయాడు. 

  • కాని, అ రౌద్రమూర్తి అనతిదూరంలోనే రాహువును పట్టుకుని మ్రింగివేయబోయాడు. అయినప్పటికినీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో, ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై, శివాభిముఖుడై 'హే జగన్నాథా! నాకు అసలే ఆకలి, దప్పికలు ఎక్కువ. వేటిని తినవద్దు అంటున్నావు గనుక, నాకు తగిన ఆహారపానీయాలు ఏమిటో ఆనతి ఇవ్వు' అని అన్నాడు. 

  • హరుడు అతనిని చూసి 'నీ మాంసాన్నే నీవు ఆరగించు' అన్నాడు. శివాజ్ఞాబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప మిగిలిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు. 

  • శిరస్సు ఒక్కటే మిగిలిన ఆ మహాపురుడిపట్ల కృపాళుడయిన మహాశివుడు - నీ యీ భయంకర కృత్యానికి సంతుష్టుడిని అయినాను. ఇకనుంచీ నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లు'మని ఆశీర్వదించాడు. 

  • ఓ పృథురాజా! తదాదిగా ఆ శిరోవషేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు 'ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించినవారి పూజలన్నీ వృథా అవుతాయి గనుక నన్ను అర్చించదలచినవారు ముందుగా కీర్తిముఖుడిని పూజించితీరాలి' అని ఈశ్వరుడు శాసించాడు కూడా. 

  • అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బార్బరస్థలంలో విముక్తుడిని చేయడంవలన తదాదిగా రాహువు బర్బరనామధేయంతో ప్రసిద్ధిచెందాడు. 

  • ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి, భయవిముక్తుడై జలంధరుడి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా పొల్లుపోకుండా చెప్పాడు.

పదకొండు, పన్నెండు అధ్యాయములు సమాప్తం

ఇరవైఒకటవ (బహుళ షష్ఠి)రోజు పారాయణ సమాప్తం

ఈ క్రింది వీడియో యు. ఆర్.యల్,లు . చూడండి... 

Note:
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.


25, నవంబర్ 2020, బుధవారం

20 కార్తీక పురాణము విశిష్టత - ఇరవైవ రోజు పారాయణ

wowitstelugu.blogspot.com

20 కార్తీక పురాణము విశిష్టత - ఇరవైవ రోజు పారాయణ 


తొమ్మిదవ అధ్యాయం


 పృథుచక్రవర్తి అడుగుతున్నాడు: 

మహర్షీ! తులసిని స్థాపించి, ఆ మండపంలోనే ముందుగా విష్ణుపూజ చేయాలని శలవిచ్చావు. పైగా తులసిని 'హరిప్రియా - విష్ణువల్లభా' లాంటి పేర్లతో సంబోధించావు. శ్రీహరికి అంతటి ప్రియమైన ఆ తులసి మహత్యాన్ని వినిపించు'నారదుడు చెబుతున్నాడు:  శ్రద్ధగా విను. 

పూర్వం ఒకసారి, ఇంద్రుడు సమస్త దేవత, అప్సర సమేతుడై శివదర్శనం కోసం కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి శివుడు వేతాళరూపి అయి ఉన్నాడు. భీతవహ దంష్ట్రానేత్రాలతో మృత్యుభయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివుడిగా గుర్తించలేక 'ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు?' అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు.  కాని, ఆ పురుషోత్తముడు జవాబు ఇవ్వకపోవడంతో కోపం తెచ్చుకున్న ఇంద్రుడు 'నా పశ్నలకు జవాబు ఇవ్వని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను. ఎవడు రక్షిస్తాడో చూస్తాను' అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టాడు. ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లగా అయింది కాని, ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ భీషణమూర్తినుండి వచ్చే తేజస్సు దేవేంద్రుడిని కూడా దగ్ధం చేసేలా తోచడంతో, దేవగురువు అయిన బృహస్పతి ఆ వేతాళ స్వరూపం శివుడే అని గ్రహించి - ఇంద్రుని చేత అతనికి మ్రొక్కించి, తాను ఈ విధంగా శాంతి స్తోత్రం చేశాడు


బృహస్పతి కృత వేతాళ శాంతి స్తోత్రము


శ్లో      నమో దేవదిదేవాయ త్ర్యంబకాయ కపర్థినే
         త్రిపురఘ్నాయ శర్వాయ నమో ధ నిఘాదినే 


శ్లో     నిరూప యదిరూపాయ బ్రహ్మరూపాయ శంభవే 
        యజ్ఞవిధ్వంసక యజ్ఞానాం ఫలదాయినే 


శ్లో     కాలంత కాలకాలాయ కాలభోగి ధరాయచ 
         
నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యయ నమో నమః 

  • బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు - ముల్లోకదాయకమైన తన త్రినేత్రాగ్నిని ఉపసంహరించడానికి నిశ్చయించుకుని 'బృహస్పతీ! నా కోపం నుంచి   ఇంద్రుణ్ణి బ్రతికించినందుకుగాను ఇక నుంచీ నువ్వు 'జీవ' అనే పేరుతొ ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఏదైనా వరం కోరుకో' అన్నాడు. 
  • ఆ మాట మీద బృహస్పతి 'హే శివా! నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను. త్రిదేవేశుణ్ణి, త్రిలోకాలను కూడా నీ మూడోకంటి మంటనుంచి రక్షించు. నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపజెయ్యి - ఇదే నా కోరిక' అన్నాడు.

  • సంతసించిన సాంబశివుడు 'వాచస్పతీ! నా ముక్కంట వెలువరించబడిన అగ్ని వెనక్కి తీసుకోదగింది కాదని తెలుసుకో. అయినా, నీ ప్రార్థనను మన్నించి ఆ అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకుగాను సముద్రంలోకి చిమ్మేస్తున్నాను' అని చెప్పాడు. చెప్పినట్లే చేశాడు శివుడు. ఆ అగ్ని గంగాసాగర సంగమంలో పడి అగ్ని బాలకరూపాన్ని ధరించింది. 
  • పుడుతూనే ఏడ్చిన వాడి ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది. ఆ రోదన వినిన బ్రహ్మ పరుగుపరుగున సముద్రుడివద్దకు వచ్చి - 'ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడు?' అని అడిగాడు. అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి 'గంగా సంగమంలో జన్మించాడు గనుక, ఇతను నా కుమారుడే. దయచేసి వీడికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరుకున్నాడు. 

  • ఈ మాటలు జరిగే లోపలేఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు. వాడిపట్టునుంచి తన గెడ్డం వదిలించుకోవడానికి బ్రహ్మకు కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. అందువల్ల విధాత 'ఓ సముద్రుడా! నా కళ్ళనుండి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడు అనే పేరు ప్రఖ్యాతుడు అవుతాడు.' అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. 

  • ఆ జాలంధరుడికి కాలనేమి కూతురైన బృందను ఇచ్చి పెళ్లి చేశారు. రూప, వయో, జలవిలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి, దానావాచార్యుడు అయిన శుక్రుడి సహాయంతో సముద్రంనుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు.

తొమ్మిదవ అధ్యాయం సమాప్తం 

పదవ అధ్యాయం

నారదుడు చెబుతున్నాడు

పూర్వం దేవతలచే హతమారి పాతాళాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరున్ని ఆశ్రయించి, నిర్భయంగా తిరగసాగారు. ఆ జలంధరుడు ఒకరోజు, శిరోవిహీనుడైన (శిరస్సు లేని) రాహువుని చూసి 'వీడికి తల లేదు ఏమిటి?' అని ప్రశ్నించిన మీదట శుక్రుడు, గతంలో జరిగిన క్షీరసాగర మథనం, అమృతపు పంపకం, ఆ సందర్భంగా విష్ణు అతని తల తెగవేయడం - మొదలైన ఇతిహాసం అంతా చెప్పాడు. అంతా విన్న సముద్ర తనయుడు అయిన జలంధరుడు మండిపడ్డాడు. తన తండ్రి అయిన సముద్రున్ని మధించడం పట్ల చాలా మధనపడ్డాడు. ఘస్మరుడు అనే వాణ్ని దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు. వాడు ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి 'నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను. ఆయన పంపిన శ్రీముఖాన్ని విను 'దేవేంద్రా! నా తండ్రి అయిన సముద్రున్ని పర్వతంతో మదించి అపహరించిన రత్నాలు అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు' అది విన్న అమరేంద్రుడు 'ఓ రాక్షస దూతా! గతంలో నాకు భయపడిన లోకకంటకాలయిన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందువల్లనే సముద్ర మథనం చేయాల్సి వచ్చింది. ఇప్పటి మీ రాజులాగానే, గతంలో శంఖుడు అనే సముద్ర నందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుడిచేత వధించబడ్డాడు. కాబట్టి సముద్ర మధన కారణాన్ని, దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్నీ కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు. ఘస్మరుడు, జలంధరుడి దగ్గరకు వెళ్ళి, దేవేంద్రుడు చెప్పిన మాటలను వినిపించాడు. మండిపడ్డ జలంధరుడు - మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు. శుంభ-నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలాపై దండెత్తాడు. ఉభయ సైన్యాలవారూ మునల పరిషు బాణ గదాద్యాయుదాలతో పరస్పరం ప్రహరించుకున్నారు. రథ, గజ, తురగాశ్వాదిక శవాలతోనూ, రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది. రాక్షసగురువైన శుక్రుడు మరణించిన రాక్షసులను అందరినీ 'మృతసంజీవనీ' విద్యతో బ్రతికించేస్తుండగా = దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను, ద్రోణగిరిమీద దివ్యౌషథాలతో చైతన్యవంతం చేయసాగాడు. ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు. ఎప్పుడయితే ద్రోణపర్వతం అదృశ్యమయ్యిందో - అప్పుడు బృహస్పతి దేవతలను చూసి 'ఓ దేవతలారా! ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు గాబట్టి, మనకు జయింప శక్యంగాకుండా వున్నాడు. అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి' అని హెచ్చరించాడు. అది వినగానే భీతావహులైన దేవతలు అందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహాంతరాళలను ఆశ్రయించారు. అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు - ఇంద్రపదవిలో తాను పట్టాభిషిక్తుడై, శంబు-నిశంబాదులను తన వ్రతవిధులుగా నిర్ణయించి, పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరుపర్వతాన్ని సమీపించాడు.


తొమ్మిది, పదవ అధ్యాయాలు సమాప్తం

ఇరువైవ (బహుళ పంచమి)  పారాయణం సమాప్తం

ఇరువైవ రోజు వీడియో యు. ఆర్. యల్.లు చూడండి


Note:  నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like, share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.