కార్తీక పురాణము విశిష్టత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కార్తీక పురాణము విశిష్టత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, డిసెంబర్ 2020, బుధవారం

30 కార్తీక పురాణము విశిష్టత - ముప్పైవ రోజు పారాయణ

wowitstelugu.blogspot.com

30 కార్తీక పురాణము విశిష్టత  - ముప్పైవ రోజు పారాయణ



ఇరవై తొమ్మిదవ అధ్యాయం

సూతుడు చెప్పిన విషయాలను విన్న ఋషులు 

'ఓ మునిరాజా! రావిచెట్టు ఎందువలన అంటరానిది అయ్యింది. ఆయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది? అని ప్రశ్నించగా, సూతమహర్షి సమాధాన పరచసాగాడు ...


రావిచెట్టు - దరిద్రదేవత


🌞పూర్వం క్షీరసాగర మథనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మినీ, కౌస్తుభాన్నీ శ్రీహరికి సమర్పించి, తక్కిన సంపద అంతా దేవతలు తీసుకున్నారు. 

🌞 శ్రీహరి, శ్రీదేవిని పెండ్లిచేసుకోదలిచాడు. కాని, శ్రీదేవి 'ఓ నారాయణా! నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది. 

🌞ఆ జ్యేష్టకు పెండ్లి గాకుండా కనిష్టనయినా నేను కళ్యాణమాడటం పాడిగాదు గనుక ముందామె మనువుకి సంకల్పించ'మని
కోరింది. 

🌞ధర్మబద్ధమైన 'రమ' మాటలను అంగీకరించి, విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్టాదేవిని సమర్పించాడు.

🌞స్థూలవదన, శుభ్రరదన, అరుణనేత్రి, కఠినగాత్రి, బిరుసుశిరోజాలూ గలిగిన జ్యేష్టాదేవిని, ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు.
                  

దరిద్రదేవతకు ఇష్టమైన స్థలములు


👉నిరంతర హోమధూప సుగంధాలతోనూ, వేదనాదాలతోనూ నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి, పెద్దమ్మ దుఃఖిస్తూ 'ఓ ఉద్దాలకా! నాకీ చోటు సరిపడదు. 

👉వేదాలు ధ్వనించేదీ, అతిథి పూజా సత్కారాలు జరిగేవీ, యజ్ఞయాగాదులు నిర్వహించబడేవీ అయిన స్థలాలలో నేను నివసించను. 

👉అన్యోనానురాగంగల భార్యాభర్తలు ఉన్నచోటగాని, పితృదేవతలు పూజింపబడే చోటగాని, ఉద్యోగస్థుడు, నీతివేత్త, ధర్మిష్టుడు, ప్రేమగా మాట్లాడేవాడు, గురుపూజా దురంధరుడూ ఉండే స్థలాలలోగాని నేను ఉండను.

👉ఏ ఇంట్లో అయితే రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ యింట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో ఎక్కడయితే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో! నేను అక్కడ ఉండటానికే ఇష్టపడతాను' 

👉ఎక్కడయితే దురాచారాలూ, పరద్రవ్య, పరభార్యాపహరణశీలురైన వారు ఉంటారో అలాంటి చోటులో అయితేనే నేను ఉంటాను. కళ్ళు త్రాగేవాళ్ళు, గోహత్యాలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతక పురుషులూ ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండటానికే ఇష్టపడతాను' అంది.


రావి మొదట్లో - జ్యేష్టానివాసం
  • ఆమె మాటలకు వేదవిదుడైన ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై 'ఓ జ్యేష్టా! నీవు కోరినట్లుగా నీకు తగిన నివాసస్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకూ నువ్వు ఈ రావిచెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చో'మని చెప్పి బయలుదేరి వెళ్ళాడు.
  • భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్టాదేవి రావిచెట్టు మొదలులో అలాగే వుండిపోయింది. ఎన్నాళ్ళకీ ఉద్దాలకుడు రాకపోవడంతో పతివిరహాన్ని భరించలేని పెద్దమ్మ, పెద్దపెట్టున దుఃఖించసాగింది. 

  • ఆమె రోదనలు వైకుంఠంలో వున్న లక్ష్మీనారాయణుల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది. 
  • విష్ణు కమలాసమేతుడై జ్యేష్టాదేవి ఎదుట ప్రత్యక్షమయి,ఆమెని ఊరడించుతూ 'ఓ జ్యేష్టాదేవీ! ఈ రావిచెట్టు నా అంశతో కూడి వుంటుంది. కనుక, నువ్వు దీని మూలంలోనే స్థిరనివాసం ఏర్పరచుకుని వుండిపో.

  • ప్రతియేటా నిన్ను పూజించే గృహస్థులయందు లక్ష్మి నివసిస్తూ వుంటుంది' అని చెప్పాడు. ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావిచెట్టు పూజనీయగానూ, అక్కడ జ్యేష్టాదేవిని షోడశోపచార విధిని అర్చించే స్త్రీలపట్ల శ్రీదేవి అమిత కరుణాకలితయై అనుగ్రహించేట్లుగానూ ఏర్పరచాడు శ్రీహరి.

👉 ఓ ఋషులారా! సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా, నారదుని చేత పృథుచక్రవర్తికి చెప్పబడిన విధానంగా, నేను మీకీ పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వివరించాను. 

👉ఎవరయితే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో సమస్త పాపాలనుండీ విడివడి విష్ణు సాయుజ్యాన్ని పొందుతున్నారు. 

👉 అని సూతుడు చెప్పగా విని సంతోషించిన ఋషులు - అక్కడినుండి బదరీవన దర్శన కాంక్షులై పయనమయ్యారు.


ఇరవై తొమ్మిది ముప్పై అధ్యాయాలు సమాప్తం

ముప్పైవ రోజు పారాయణ సమాప్తం


కార్తీక మాసపురాణ పారాయణసంపూర్ణం 

ఈ క్రింది యు. ఆర్. యల్. ల లో ముప్పైవ రోజు పారాయణ చూడండి 

Note:

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,   కామెంట్   చేయడం మర్చిపోకండి.

ఈ రోజు సూక్తి 
"Learn from the past, set vivid, detailed goals for the future, and live in the only moment of time over which you have any control: now."
-Denis Waitley

29 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ

wowitstelugu.blogspot.com

29 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ


ఇరవై ఏడవ అధ్యాయం

నారదుడి హితవుపై రవ్వంత చింతించిన యముడు, ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి, నరకాన్ని తరింపచేయవలసినదిగా ఆదేశించాడు. ఆ దూత, ధనేశ్వరుడిని తనతో తీసుకొనివెడుతూ మార్గమధ్యంలో నరక భేదాలను చూపిస్తూ, వాటి గురించి ఇలా వినిపించసాగాడు ...

తపవాలుకము

'ఓ ధనేశ్వరా! మరణించిన వెంటనే, పాపకర్మలు ఇక్కడే కాల్చబడిన శరీరములు కలవారై - దిక్కులు వ్రకల్లయ్యేలా రోదిస్తూ వుంటారు. దీనినే 'తప్తవాలుక నరకము' అంటారు. వైశ్యదేవవరులైన అతిథులను పూజించనివారూ, గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవును, వేదవిధులను, యజమానిని కాళ్ళతో తన్నినవారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు!

 క్రకచము

అనే పేరుగల ఈ నరకం మూడవది. ఇక్కడ పాపాత్ములను అడ్డముగానూ, నిలువుగానూ, ఏటవాలుగానూ, సమూలముగానూ, అంగాంగములుగానూ రంపములతో కోస్తూ ఉంటారు.

అసిపత్రవనం

నాలుగవ నరకధోరణి అయిన దీనినే అసిపత్రవనం అంటారు. భార్యా-భర్తలను, తల్లి-దండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులు అంతా ఈ నరకానికి చేరి, నిలువెల్లా బాణాలతో గ్రుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి, ధారలుగా కారే నెత్తుటి వాసనకు వెంటపడి తరిమే తోడేళ్ళ గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులుతీసి, పారిపోయే దిక్కులేక పరితపిస్తూ వుంటారు. చంపుట, భేదించుట మొదలైన విధులతో ఈ నరకం ఆరు రకాలుగా వుంటుంది. 

కూటశాల్మలి

పదహారు రకాలుగా దండించేదీ, పరస్త్రీలనూ, ద్రవ్యాన్నీ హరించేవాళ్ళూ, పరాపకారులూ అయిన పాపులు వుండేది 'కూటశాల్మలీ' నరకం.

రక్తపూయం

'రక్తపూయ'మనే ఈ విభాగం ఆరవ నరకం. ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వ్రేలాడుతూ యమకింకరులచేత దండించబడుతూ వుంటారు. ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో, పేర్లను నిందిస్తారో, చాడీలు చెబుతుంటారో వారు అంతా ఈ నరకంలోనే వుంటారు.

కుంభీపాకం

మొట్టమొదట నీకు విధించబడినదీ, ఘోరాతి ఘోరమైన నరకాలన్నిటిలోకీ నికృష్టమైనదీ అయిన ఈ 'కుంభీపాక'మే ఏడవ నరకం. దుష్టద్రవ్యములు, దుర్భారాగ్నికీలలు, దుస్సహదుర్గంధాలతో కూడి వుంటుంది.

రౌరవం

నరకాలలో ఎనిమిదవదైన ఈ 'రౌరవం' దీర్ఘకాలికమని తెలుసుకో. ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరములదాకా బైట పడలేరు.

ధనేశ్వరా! మన ప్రమేయం లేకుండా మనకంటినపాపాన్ని శుష్కమనీ, మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ధ్రమనీ అంటారు. ఆ రెండు రకాల పాపాలూ కలిపి ఏడు విధాలుగా వున్నాయి.

(1) అపకీర్ణం

(2) పాంక్తేయం

(3) మలినీకరణం

(4) జాతిభ్రంశం

(5) ఉపవీతకం

(6) అతిపాతకం

(7) మహాపాతకం.

ఈ పరిదృశ్యమానులైన నరులచేత ఉపరి ఏడు రకాల నరకాలూ వరుసగా అనుభవింపబడుతూ వున్నాయి. కాని, నువ్వు కార్తీక వ్రతస్థులైన సజ్జనుల సాంగత్యం ద్వారా పొందిన అమితపుణ్యం కలిగినవాడివి కావడం వలన ఈ నరకాలను కేవల దర్శనమాత్రంగా తరించగలిగావు.

పై విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి, అతనిని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ తను యక్షరూపుడై, కుబేరుడికి ఆప్తుడై, ధనయక్షుడు అనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు ఆ మధ్యలో ఏర్పరచిన 'ధనయక్షుతీర్థం' ఇతని పేరుమీదనే సుమా! అందువలన, సత్యభామా! పాపహారిణీ, శోకనాశినీ అయిన ఈ కార్తీక వ్రత ప్రభావంవల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరు అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. అని సత్యభామకు చెప్పినవాడై, శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్టార్థమై స్వీయగృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు.


ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం


ఇరవై ఎనిమిదవ అధ్యాయం


సూత ఉవాచ: 

🌞ఈ కార్తీకమాసము పాపనాశని విష్ణువుకు ప్రియకరి, వ్రతస్థులకు భుక్తి, ముక్తిదాయినీ అయి వుంది. 

🌞కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము, ప్రాతఃస్నానము, తులసి సేవ ఉద్యాపనం, దీపదానం అనే ఈ అయిదింటినీ కూడా కార్తీక మాసంలో ఆచరించినవారు ఇహానుభుక్తిని, పరానముక్తినీ పొందుతున్నారు. 

🌞పాపాలు పోవాలన్నా, దుఖాలు తీరాలన్నా, కష్టాలు కడతేరాలన్నా కార్తీకవ్రతాన్ని మించినది మరొకటి లేదు. ధర్మార్థ కామమోక్షాలు నాలుగింటికోసమూ కూడా ఈ కార్తీకవ్రతం ఆచరించవలసి వుంది.

🌞కష్టుడయినా, దుర్గారణ్యగతుడు అయినా, రోగి అయినా సరే విడువకుండా ఈ వ్రతాన్ని పాటించాలి. ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనో, విష్ణువు ఆలయంలోనో హరిజాగారాన్ని ఆచరించాలి. 

🌞శివవిష్ణు దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావిచెట్టువద్దగానీ, తులసీవనంలోగాని వ్రతం చేసుకొనవచ్చును. 

🌞విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలు ఆలపించే వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్నీ, వాద్యాలను వాయించేవాళ్ళు అశ్వమేథఫలాన్నీ, నర్తకులు సర్వతీర్థాల స్నానఫలాన్నీ పొందుతారు. 

🌞ఆపదలలో ఉన్నవాడు, రోగీ, మంచినీరు దొరకనివాడు, వీళ్ళు కేశవ నామములతో లాంచన మార్జన ఆచరించితే చాలు, వ్రతోద్యాపనకు శక్తిలేనివాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది.


శ్లో ||    ''అవ్యక్తరూపిణో విష్ణో స్వరూపో బ్రాహ్మణోభువీ'' 

  • శీమహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు, కావున ఈ కార్తీకమందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం. 

  • అందుకు కూడా శక్తిలేనివాళ్ళు గో పూజ చేసినా చాలును, ఆ పాటి శక్తయినా లేనివాళ్ళు రావి-మఱ్ఱి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు. 

  • దీపదానం చేసే స్తోమత లేనివారు, దీపారాధన అయినా తాహతు లేనివారు ఇతరులచే వేలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి, గాలి మొదలైన వాటివలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేని వారు తులసి బదులు విష్ణుభక్తుడైన బ్రాహ్మణున్ని పూజించాలి.


 రావి - మఱ్ఱి

👉 సూతుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నిటి కంటే కూడా రావి, మఱ్ఱి వృక్షాలు మాత్రమే గో, బ్రాహ్మణతుల్య పావిత్ర్యత నెలా పొందాయి అని అడిగాడు సూతుడు.

👉 పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహా సురతభాగంలో వుండగా కార్యాంతరం వలన దేవతలు, అగ్నీ కలిసి బ్రాహ్మణ వేషదారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. 

👉అందుకు కినిసిన పార్వతీదేవి 'సృష్టిలోని క్రిమికీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి. 

👉 అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లయి పడివుండండి' అని శపించింది. 

👉 దాని కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసివచ్చింది. 

👉ఆ పరిణామంలో బ్రహ్మ పాలాశవృక్షంగానూ, విష్ణువు అశ్వత్థంగానూ, శివుడు వటముగానూ మారారు. 

👉 బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయులైన శివకేశవరూపాలు గనుకనే రావి-మఱ్ఱి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. 

👉 వీటిలో రావి చెట్టు శనిదృష్టి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది. ఇతర వారాలలో రావిచెట్టును తాకరాదు సుమా! అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు.


ఇరవై ఏడు, ఇరవై ఎనిమిది అధ్యాయాలు సమాప్తం


ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ సమాప్తం


ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్ ల లో ఇరవై ఎనిమిదవ 

రోజు పారాయణం చూడండి


Karthika Puranam Day-29 | కార్తీక పురాణం 29 ...

Quote Today:
"Our greatest glory is not in never falling, but in rising every time we fall."
-Confucius

Note:
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,   కామెంట్   చేయడం మర్చిపోకండి.



1, డిసెంబర్ 2020, మంగళవారం

28 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ

wowitstelugu.blogspot.com

28 కార్తీక పురాణము విశిష్టత -  ఇరవై  ఎనిమిదవ  రోజు పారాయణ



శ్రీక్రిష్ణుడు చెబుతున్నాడు

ఇరవై అయిదవ అధ్యాయం:

  • సత్యభామ! నారదప్రోక్తలైన (నారదుడు చెప్పిన)సంగతులతో ఆశ్చర్యమనస్కుడు అయిన పృథువు, ఆ ఋషిని పూజించి, అతని వద్ద శలవు తీసుకున్నాడు. 

  • ఆ కారణంగా ఈ మూడు వ్రతాలూ కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రం అయి ఉన్నాయి. మాఘ కార్తీక వ్రతముల వలెనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా! ఎవరయితే వీటిని విధివిధానంగా ఆచరిస్తారో, వాళ్ళు నాకు యజ్ఞాది కర్మకాండలు చేసినవారికంటే కూడా చేరువ స్నేహితులు అవుతున్నారు. 

  • అటువంటి వాళ్ళు నా కరుణాప్రాప్తులై పాపభీతి లేనివాళ్ళు అవుతారు.

  • శ్రీ కృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ 'స్వామీ! ధర్మదత్తునిచే ధారపోయబడిన పుణ్యంవలన 'కలహ'కు కైవల్యం లభించింది. 

  • కేవలం కార్తీకమాసపు పుణ్యంవలన రాజద్రోహ మొదలైన పాపాలు పటాపంచలు అయిపోతున్నాయి. 

  • స్వయంకృతాలో, కర్తలనుండి దత్తములో అయినవి సరే, అలా కాకుండా మానవజాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానం ఏమిటి? దానిని వివరించు' అని కోరడంతో గోవిందుడు ఇలా చెప్పసాగాడు.


పాపపుణ్యములు ఏర్పడు విధానము


శ్లో     దేశ గ్రామకులానిస్యు ర్భోగభాంజికృతాదిషు     
           కలౌతు కేవలంకర్తా ఫలభు క్పుణ్య పాపయోః

  • 'ప్రియా! కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు దేశానికీ, త్రేతాయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికీ, ద్వాపరయుగంలోనివి వారివారి వంశాలకి చెందినవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ 'కర్త' ఒక్కడికే సిద్ధిస్తుంది. 

  • సంసర్గరహిత సమాయత్తములయే పాపపుణ్యాలను గురించి చెబుతాను విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించటంవలన, ఒక స్త్రీతో రమిచడంవలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగానూ, సంపూర్తిగానూ అనుభవిస్తున్నాడు.

  • వేదాదిబోధనల వలన, యజ్ఞము చేయడంవలన, పంక్తిభోజనంవలన కలిగే పాపపుణ్యాలలో నాలుగవవంతును మాత్రమే పొందుతున్నాడు. 

  • ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన, వినడంవలన, తలచుకోవడంవలన అందులోని వందవభాగాన్ని తాను పొందుతున్నాడు.

  • ఇతరులను ద్వేషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితూరీలు చేసేవాడు, వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని, తన పుణ్యాన్ని జారవిడుచుకుంటున్నాడని తెలుసుకో. 

  • తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుని చేతనో, ఇతరుల చేత సేవలు చేయించుకొన్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును యిచ్చి తీరాలి.

  • అలా ఈయనివాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకున్నవాడు అవుతున్నాడు, పంక్తి భోజనాలలో, భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికీ జరిగిందో వారు, యజమానుల పుణ్యంలో ఆరవభాగాన్ని హరించినవారు అవుతున్నారు. 

  • స్నాన, సంధ్యాదులను ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా, వారు తమ పుణ్యంలో ఆరవవంతు ఆ యితరులకు కోల్పోతారు. 

  • ఎవరినుంచి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మవలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వానికే చెబుతుంది. 

  • కర్తకు కర్మఫలం తప్ప మరేమీ మిగలదు. దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్య కర్మలవలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ చేసేవాడికి దక్కదు.

  • ఋణశేషం ఉండగా మరణించినవారి పుణ్యంలో - శేషఋణానికి తగినంత పుణ్యం ఋణదాతకు చెందుతూ వుంది. పాపంగాని, పుణ్యంగాని, ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడూ, ఆ పనిచేయడంలో తోడుపడేవాడు, దానికి తగిన సాధన సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక ఆరవవంతు ఫలాన్నీ పొందుతారు. 

  • ప్రజల పాపపుణ్యాలలో రాజుకు, శిష్యుడివాటిలో గురువుకు, కుమారుడినుండి తండ్రికి, భార్యనుండి భర్తకు - ఆరవభాగము చేరుతుంది. 

  • ఏ స్త్రీ అయితే పతిభక్తి కలది, నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతుంది. తన సేవకుడో, కొడుకోగాని ఇతరునిచేత ఆచరింపచేసిన పుణ్యాలలో తనకు ఆరవవంతు మాత్రమే లభిస్తుంది.

  • ఈ విధంగా ఇతరులు ఎవరూ మనకి దానం చేయకపోయినా, మనకేమీ నిమిత్తమూ లేకపోయినా వివిధ జనసాంగాత్యాలవలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించకతప్పడం లేదు. 

  • అందువల్లనే సజ్జనసాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి, ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను.


ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం

ఇరవై ఆరవ అధ్యాయం 

ధనేశ్వరుని కథ - సత్సాంగత్య మహిమ


బహుకాల పూర్వం అవంతీపురంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగానే ధనికుడు అయిన అతగాడు కులాచార భ్రష్టుడయి పాపకర్మల పట్ల ఆసక్తుడయి సంచరించేవాడు. 

అసత్య భాషణం, చౌర్యం, వేశ్యాగమనం, మధుపానం, మొదలైన దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమేగాక, షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు.


వర్తకం నిమిత్తం ఒక దేశమునుంచి మరొక దేశానికి వెళ్ళడం అతని అలవాటు. అదే విధంగా ఒకసారి మాహిష్మతీనగరం చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదానది ప్రవహిస్తూ ఉంది.


ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీకమాసం ప్రవేశించింది. దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది. 

వచ్చేపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతంది కదా! ధనేశ్వరుడు ఆ నెలంతా అక్కడనే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజూ నర్మదా తీరంలో సంచరిస్తూ, అక్కడ స్నాన-జప-దేవతార్చనా విధులను నిర్వహిస్తున్న బ్రాహ్మణులను చూశాడు. 

కొందరు కార్తీక పురాణ శ్రవణాన్ని ఆచరించడం చూశాడు. మరికొందరు నృత్యగాన మంగళవాద్య యుతంగా హరికీర్తనలను, కథలను ఆలపించేవారూ, విష్ణుముద్రలను ధరించినవాళ్ళు, తులసి మాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు,

చూడటమే కాదు, నెలపొడుగునా అక్కడే మసలుతూ ఉండటం వలన వారితో పరిచయం కలిగింది, వారితో సంభాషిస్తూ ఉండేవాడు. ఎందఱో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు. 

చివరకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణునామ ఉచ్చారణం కూడా చేసేవాడు. నెలరోజులూ యిట్టె గడిచిపోయాయి. 

కార్తీక ఉద్యాపనా విధినీ, విష్ణు జాగారాన్నీ కూడా దర్శించాడా ధనేశ్వరుడు. పౌర్ణమినాడు గో, బ్రాహ్మణ పూజలను ఆచరించి, దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు. తరువాత సాయంకాలం శివప్రీత్యర్థ్యం చేయబడిన దీపోత్సవాలను తిలకించాడు. 

సత్యభామా! నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో శివారాధన దేనికా అని ఆశ్చర్యపడకు సుమా!


శ్లో || మమరుద్రస్వయఃకశ్చి దంతరం వరికల్పయేత్ 
         
తస్యపుణ్య క్రియాస్సర్వానిష్ఫ లాస్యుర్న సంశయః!!


  • ఎవరైతే నన్నూ, శివుణ్ణీ భేదభావంతో చూస్తారో, వారియొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృథా అయిపోతాయి. అదీగాక, ఆ శివుడు కార్తీక పౌర్ణమినాడే త్రిపురసంహారం చేసినవాడు అవడం చేత గూడా, ఆయనను ఆ రోజున ఆరాధిస్తారు. 

  • ఇక ధనేశ్వరుడు ఈ పూజా మహోత్సవాలను అన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోను, వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరిగుతున్నాడు కాని, ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణసర్పం అతనిని కాటువేయడం, తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారకంలో వున్న అతగాడికి అక్కడి భక్తులు తులసితీర్థాన్ని సేవింపచేయడం, ఆ అనంతర క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది.

  • మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుడిని పాశబద్ధుడిని చేసి, కొరడాలతో మోదుతూ యముడి వద్దకు తీసుకువెళ్ళారు. 

  • యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ప్రారంభించగా చిత్రగుప్తుడు 'హే ధర్మరాజా! వీడు ఆగర్భ పాపత్ముడేగాని, అణువంతయినా పుణ్యం చేసినవాడు కాదు' అని చెప్పాడు. ఆ మాటమీద దండధరుడు తన దూతలచేత ధనేశ్వరుడి తలను చితగ్గొట్టించి, కుంభీపాక నరకంలో వేయించాడు.

  • కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని యముడికి విన్నవించారు. 

  • అంతకంటే అబ్బురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుడిని తన కొలువుకు పిలిపించి మళ్ళీ విచారణను తలపెడుతుండగా, అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు 'ఓ యమధర్మరాజా! ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలయిన పుణ్యాలను ఆచరించాడు గనుక, ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు. 

  • ఏవయితే పుణ్యపురుష దర్శన, స్పర్శన, భాషణలకు పాత్రులో వారు సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరవభాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటి ఈ ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులయిన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది వున్నాడు. 

  • కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీగాక అవసానవేళ హరిభక్తులచేత తులసీతీర్థం పొందాడు. కర్ణపుటాలలో హరినామస్మరణం జరుపబడింది. 

  • పుణ్యనర్మదా తీర్థాలతో విగతదేహం సుస్నాతమయ్యింది. అందరు హరిప్రియుల ఆదరణకు పాత్రుడు అయిన ఈ విప్రుడు పుణ్యాత్ముడైన ఈ భూసురుడు - పాపభోగాలయమైన నరకంలో ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు.


ఇరవై అయిదు, ఇరవై ఆరు అధ్యాయాలు సమాప్తం  


ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ సమాప్తం 

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో  ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ చూడండి

Note:

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,   కామెంట్   చేయడం మర్చిపోకండి